పకడ్బందీగా ఇంటర్ పరీక్షaలు
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:50 PM
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు
కరీంనగర్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమైన నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (ఆర్ట్స్, కామర్స్), ముకరంపురలోని నారాయణ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. సౌకర్యాలను, సీసీ కెమెరా వ్యవస్థను పరిశీలించారు. హాల్టికెట్ల తనిఖీ, బందోబస్తు ఏర్పాట్లు తదితర విషయాలపై ఆరా తీశారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేలా చూడాలని అన్నారు. మాల్ ప్రాక్టీస్కి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. ఒకేషనల్ కోర్సులు కలుపుకొని జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 15,389 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా మొదటిరోజు 400 మంది గైర్హాజరయ్యారు. 14,989 మంది పరీక్షలు రాశారు. మాల్ప్రాక్టీస్ వంటి ఘటనలు ఏమీ చోటు చేసుకోలేదు.