Share News

ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తిచేయాలి

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:40 AM

లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సూచించారు.

 ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తిచేయాలి

- కలెక్టర్‌ సత్యాప్రసాద్‌

మెట్‌పల్లి రూరల్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సూచించారు. గురువారం మండలంలోని వెల్లుల్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్‌ పరిశీలించారు. మండలంలో ఇప్పటివరకు ఇండ్ల నిర్మాణాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాలను త్వరగా పూర్తిచేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు క్యాప్చర్‌ చేస్తూ ఆనలైనలో నమోదు చేయాలని, లబ్ధిదారులకు ప్రభుత్వం తరుపు నుంచి ఆర్థికసహాయం సకాలంలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సర్పంచ గూడూరు తిరుపతి, తహసీల్దార్‌ నీత, పీడీ ప్రసాద్‌, ఎంపీడీవో సురేష్‌, ఎంపీవో మమేశ్వర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నారాయణ, హౌసింగ్‌ ఏఈ శరత, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

- మున్సిపల్‌ కార్యాలయం, పాఠశాల తనిఖీ

మెట్‌పల్లి టౌన: పట్టణంలోని బీసీ వెల్ఫేర్‌ పాఠశాలతోపాటు మున్సిపల్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ గురువారం తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, వసతి సౌకర్యాలు, భోజన ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతోపాటు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. అనంతరం ఆయన మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లి పలు రికార్డులను పరిశీలించారు. పన్ను వసూళ్ల ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం, పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలన్నారు. ఆయన వెంట ఎస్సీ వెల్ఫేర్‌ అధికారి రాజకుమార్‌, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్‌ సత్యనారాయణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 12:41 AM