కరీంనగర్ అభివృద్ధికి భారీగా నిధులు
ABN , Publish Date - May 23 , 2026 | 12:13 AM
కరీంనగర్ అభివృద్ధికి భారీగా నిధులు రావడం చారిత్రాత్మక విజయమని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు.
కరీంనగర్ టౌన్ , మే 22(ఆంధ్రజ్యోతి): కరీంనగర్ అభివృద్ధికి భారీగా నిధులు రావడం చారిత్రాత్మక విజయమని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కింద కరీంనగర్ నగర అభివృద్ధికి 840 కోట్ల రూపాయల భారీ నిధులను ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో నగర రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయన్నారు. హైదరాబాద్ తర్వాత ఆధునిక సౌకర్యాలతో వేగంగా అభివృద్ధి చెందే నగరంగా కరీంనగర్ నిలవబోతున్నదన్నారు. మోడల్ రోడ్లు, స్కైవాక్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, జంక్షన్ అభివృద్ధి కోసం రూ.630 కోట్ల మంజూరయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా నగర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. వర్షాకాలంలో ప్రజలను ఇబ్బంది పెట్టే ముంపు సమస్యలను నివారిం చేందుకు డ్రైయిన్లు పునరుద్ధరణ, వరద నియంత్రణ పనుల కోసం 130 కోట్లు కేటాయించా రన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ కోసం రూ.80 కోట్లు ఆమోదించబడినట్లు తెలిపారు. తొలుత యూసిఎఫ్ జాబితాలో కరీంనగర్ లేక పోయినా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ పట్టుదల వల్లే నిధులు సాధ్యమయ్యాయన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై కేంద్ర మంత్రికి ఉన్న నిబద్ధత ఇది అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర పట్ట పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్కు నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర అధికారుల బృందం ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టుల అవసరాన్ని గుర్తించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి రూపాయిని పారదర్శకంగా వినియోగిస్తామన్నారు. అనంతరం నగర డిప్యూటీ మేయర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్రావు మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ గతంలోనే 1400 కోట్లతో నిధులు తీసుకు రావడం జరిగిందన్నారు. నూతన పాలక వర్గం ఏర్పడిన మూడు నెలల్లోనే నగర అభివృద్ధికి ప్రణాళికలు వేసుకుని ఎన్ని కల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి నిరంత ప్రక్రియగా అభివృద్ధి కొనసాగించాలనే లక్ష్యంగా భారీగా నిధులు మంజూరు చేయించారన్నారు. 840 కోట్ల రూపాయలలో 210 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా, 210 కోట్లు కేంద్ర ప్రభుత్వ వాటా కాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో మరో 420 కోట్లు వాటాగా నిధులు మంజూరు చేయించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.