‘అభివృద్ధి’ మంత్రంపై ఆశలు
ABN , Publish Date - Jan 30 , 2026 | 01:02 AM
వేములవాడ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసు కునేందుకు ఆయా పార్టీలు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నాయి.
వేములవాడ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : వేములవాడ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసు కునేందుకు ఆయా పార్టీలు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నాయి. తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందంటూ బీఆర్ఎస్, తమ హయాంలోనే అభివృద్ధి చేస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీలు పేర్కొంటున్నాయి. అయితే.. పీఠాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటుందా..? అధికార పార్టీ వ్యూహాలను చేదించి కారు పట్టు నిలుపుకుం టుందా అనే ఉత్కంఠ పట్టణ ప్రజల్లో రేకెత్తు తోంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ పర్వం కొనసాగుతుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువంగా ఉంది. ఒక్కో వార్డులో ముగ్గురికి పైగా కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికి అధి కార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించక పోవడంతో అభ్యర్థులు అయోమయంలో కొట్టు మిట్టాడుతున్నారు. అంతే కాకుండా అధికార పార్టీ వ్యూహాన్ని అనుసరిస్తూ బీఆర్ఎస్ పార్టీ సైతం ప్రధాన వార్డుల్లోని తమ అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం వహిస్తోంది. ఒకప్పుడు వేములవాడ పట్టణం బీజేపీకి పెట్టింది పేరుగా నిలిచింది. బీజేపీ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను చేదించుకుని కలిసికట్టుగా మున్సి పల్ ఎన్నికల్లో పనిచేసి కమలాన్ని బీజేపీ నేతలు వికసించేలా చేస్తారా.. లేదా.. అనే అను మానాలు పట్టణ వాసుల్లో వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ పీఠం బీసీ జనరల్కు కేటాయిం చడంతో ఆయా పార్టీలు తమ పార్టీ జెండాను ఎగరవేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వేముల వాడ మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండాను ఎగురవేసి సీఎం రేవంత్రెడ్డికి కానుకగా అందిం చాలనే కృతనిశ్చయంతో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పావులు కదుపు తున్నారు. అంతేకాకుండా గత రెండు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడం తో హైట్రిక్ కొట్టి కేటీఆర్కు అందించే లనే ఉద్దేశ్యంతో బీ ఆర్ఎస్ నియోజక రవ్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు కారు జోరును సాగిస్తున్నారు.
చేపడుతున్న అభివృద్ధి పనులపై కాంగ్రెస్..
వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యంగా పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూపిస్తూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జనం లోకి బలంగా వెళుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేములవాడకు పెద్ద ఎత్తున నిధులను రాబట్టడమే కాకుండా మరిన్ని అభివృద్ధి పనుల కోసం పట్టుబట్టి మరీ నిధులు మంజూరు చేయి స్తుండటం అధికార కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది. రాజన్న ఆలయాన్ని రూ. 150 కోట్లతో అభివృద్ధి చేస్తుండగా అన్నదాన సత్రం, 80 ఫీట్ల రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులు, పట్టణంలోని మురుగు నీరు మూలవాగు, రాజన్న ఆలయ గుడి చెరువులో కలవకుండా పట్టణ శివారులోకి తరలించేందకు చేపట్టే పనులు, పట్టణంలోని శివారు కాలనీలతో పాటు ప్రతి కాలనీకి సీసీ, డ్రైనేజీ నిర్మాణాలకు, పట్టణంలోని 43 కుల సంఘ భవనాలకు నిధుల మంజూరుతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ వోసీలతో పాటు సంక్షేమ పథకాలను చూపిస్తూ జనంలోకి వెళ్లడం ఆ పార్టీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు.
గతంలో చేపట్టిన అభివృద్ధిపై బీఆర్ఎస్..
గత రెండు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసిన బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టాలనే ధీమాతో ఉంది. అయితే గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పను లను చెప్పుకుండా బీఆర్ఎస్ అభ్యర్థులు ఓట్లను అభ్యర్థిస్తున్నారు. పట్టణంలోని మొదటి, రెండవ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు, రాజన్న ఆల యానికి చెందిన గుడి చెరువు పూడ్చివేత పనులు, కూరగాయాల మార్కెట్ నిర్మాణం, మున్సిపల్ పార్కుల నిర్మాణాలు, గడప గడపకు సీసీ, డ్రైనేజీల నిర్మాణాలు తమ హయంలోనే చేపట్టామని ఆయుధంగా ముందుకు వెళుతు న్నారు. అంతే కాకుండా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న సానుభూతితో క్షేత్రస్థాయిలో ఓటర్లును ఆకట్టునే ప్రయత్నం చేస్తూ ఓట్లు దండుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కదులు తున్నట్లు తెలుస్తోంది.
కమలంపైనే దృష్టి..
వేములవాడ పట్టణం అంటే ఒకప్పుడు బీజే పీకి కంచుకోటగా ఉండేది. అయితే బీజేపీలో నెలకొన్న అంతర్గత విభేదాలతో సరైన నాయక త్వం లేక క్యాడర్ దెబ్బతిన్నదనే విమర్శలు మూటగట్టుకుంది. పట్టణంలో బీజేపీకి ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఓటుగా మలుచుకునేం దుకు కమలనాథులు అందరు ఒక తాటిపైకి వచ్చి కమలం వికసించేలా చూసి బీజేపీకి పూర్వవైభవం తీసుకువస్తుందా..? లేదా..? అనే ఆలోచనలో పట్టణ ప్రజలు ఉన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్కుమార్ అండదండలు మెండగా ఉండ టంతో పట్టణంలో బీజేపీ మున్సిపల్ పీఠంపై ఇప్పటికైనా పట్టుబిగించడం పెద్ద పనేమీకాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే టికెట్ తమకే వస్తుందని తెలిసిన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షమ పథకాలతో వార్డుల్లో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు.