అల్బెండజోల్ మాత్రల పంపిణీకి సర్వం సిద్ధం
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:10 AM
జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 1 నుంచి 19 సంవత్సరాల లోపు బాలలకు అల్బెండజోల్ మాత్రల పంపిణీకి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. నేషనల్ హెల్త్ మిషన్ ఆద్వర్యంలో 2015 నుంచి ప్రతి యేటా జూలై 13న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
సుభాష్నగర్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 1 నుంచి 19 సంవత్సరాల లోపు బాలలకు అల్బెండజోల్ మాత్రల పంపిణీకి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. నేషనల్ హెల్త్ మిషన్ ఆద్వర్యంలో 2015 నుంచి ప్రతి యేటా జూలై 13న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఫ నులి పురుగులతో ఇబ్బందులు..
పిల్లలు ఎక్కువగా నులి పురుగుల బారిన పడతారు. 14 ఏళ్లలోపు పిల్లలు తరుచూ నేలపై ఆడుకుంటారు. చేతులు సరిగా కడుక్కోకపోవడం పారిశుధ్యలోపాలు ఇతర కారణాలతో నులి పురుగులు సోకుతాయి. నులిపురుగుల సంక్రమణ పిల్లల్లో నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. మొదట్లో లక్షణాలు స్పష్టంగా కనిపించకపోయినా తరువాత పూర్తిస్థాయిలో కనిపిస్తాయి. కడుపునొప్పి, ఉబ్బరం, తరుచూ విరేచనాలు, ఆకలి మందగించడం లేదా ఆకస్మికంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఫ నివారణ చర్యలు...
నులిపరుగుల నివారణ కోసం శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. భోజనానికి ముందు చేతులను శుభ్ర పరుచుకోవాలి. గోళ్లను కత్తిరించుకోవాలి.
ఫ ఆల్బెండజోల్ మాత్రలు ఎవరు తీసుకోవాలి...
1 నుంచి 19 ఏళ్ళ వయస్సుగల వారు ఎవరైనా ఈ ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలి. లక్షణాలు కనిపించినా, కనిపించకపోయినా ఈ నివారణ మాత్రలను తీసుకోవాలి. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న వారు 2,59,365 మంది ఉన్నట్లుగా వైద్యఆరోగ్యశాఖ గుర్తించింది. జిల్లాలో 924 పాఠశాలలు, 66 జూనియర్ కళాశాలలు, 777 అంగన్వాడీ కేంద్రాల్లో అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడానికి వైద్యఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా 632 ఆశావర్కర్లు, 777 అంగన్వాడీ టీచర్లు, 990 పాఠశాల, కళాశాలల ప్రతినిధుల ద్వారా అల్బెండజోల్ మాత్రల పంపిణీ చేస్తామని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి తెలిపారు.