కేటీఆర్ ఇలాకాలోనూ.. తప్పని బేరసారాలు
ABN , Publish Date - Apr 14 , 2026 | 01:06 AM
సిరిసిల్ల మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎంపిక ఉత్కంఠగా సాగింది. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కే తారక రామా రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో మునిసిపల్పై గులాబీ జెండా ఎగిరింది. 39 కౌన్సిలర్లలో 27 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
సిరిసిల్ల మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎంపిక ఉత్కంఠగా సాగింది. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కే తారక రామా రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో మునిసిపల్పై గులాబీ జెండా ఎగిరింది. 39 కౌన్సిలర్లలో 27 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో కోఆప్షన్ పదవులు బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక లాంఛ నంగానే ముగిసినా ఉత్కంఠగా సాగింది. సోమవారం చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి అధ్యక్షతన నలుగురు కో ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఇందుకోసం ఏప్రిల్ 1 నుంచి 7 తేదీ వరకు కోఆప్షన్ పదవుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందు లో నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థులను ఏకగ్రీవంగా కోఆప్షన్ సభ్యులుగా కౌన్సిల్ ఎన్నుకుంది. ఇందులో జనరల్ పురుషుల స్థానం నుంచి బీఆర్ఎస్కు చెందిన మాజీ కౌన్సిలర్ నంది శంకర్, జనరల్ మహిళ స్థానం నుంచి మాజీ కౌన్సిలర్ కొండ అనూష, మైనారిటీ పురుషుల స్థానం నుంచి సయ్యద్ సోహెల్, మైనారిటీ మహిళా స్థానం నుంచి మాజీ కౌన్సిలర్ సయ్యద్ తస్లీమ్లను ఎన్నుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సూచనల మేరకే నలుగురు కో ఆప్షన్ అభ్యర్థులను ముందు గానే ఎంపిక చేసినా స్థానికంగా ఉన్న కౌన్సిల్ పెద్దలు మాత్రం డబ్బుల కు తెరలేపినట్లు చర్చ జరిగింది. చివరి క్షణంలో ఒప్పుకున్న బేరం వద్ద కోఆప్షన్ సభ్యులు తమకు మాజీ మంత్రి కేటీఆర్ పదవి ఇస్తున్నట్లు చెప్పాడని డబ్బులు ఇవ్వడానికి ఆసక్తి చూపకపోవడంతో బేరసారాలు బహిర్గతమయ్యాయి. కో ఆప్షన్ సభ్యుల ప్రకటన చేసే సమయంలో చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి సమావేశం అరగంట వాయిదా వేశారు. కౌన్సిల్ సమావేశం పక్కనే మున్సిపల్ కార్యాలయంలోనే మరో గదిలో చైర్పర్సన్ భర్త, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జందం చక్రపాణి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, మాజీ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్లతో పాటు సీనియర్ కౌన్సిలర్లు కోఆప్షన్ పదవులు ఆశించిన వారితో మళ్లీ చర్చలు జరిపారు. మున్సిపల్ కార్యా లయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చి గదుల్లో తలుపులు మూసుకొని చర్చలు జరిపారు, మీడియాను కూడా అడ్డుకునే ప్రయ త్నం చేయడం గమనార్హం. రహస్య చర్చల్లో చివరకు ఒప్పందం చేసుకున్న దానిలో చివరకు కో ఆప్షన్ పదవులు పొందినవారు సగానికి ఒప్పుకున్నారు. దీంతో మళ్లీ కౌన్సిల్లో చైర్ర్సన్ అభ్యర్థుల ఎంపిక ప్రకట న చేయడంతో పాటు దాదాపు కోఆప్షన్ సభ్యులుగా నంది శంకర్, కొండ అనూష, సయ్యద్ సోహెల్, సయ్యద్ తస్లీమ్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.
సీఎం ఫొటోపై బీఆర్ఎస్, కాంగ్రెస్ వాగ్వాదం
మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో పెట్టాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు పట్టుబట్టారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ కోఆప్షన్ ఎంపిక కోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ముందు గానే కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఆడెపు చంద్రకళ మున్సిపల్ కౌన్సిల్హాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో పెట్టాలని కోరారు. దీంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్లో ఎక్కడ కూడా ముఖ్యమంత్రుల ఫొటోలు ఉండవని చెప్పడంతో చర్చకు దారి తీసింది. మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల మున్సిపల్కు అబివృదిఽ్ధ కోసం రూ. 41 కోట్లు మంజూరు చేసిందని. జీవోను కాంగ్రెస్ ప్రభు త్వం రద్దు చేసిందని అన్నారు. రూ. 41 కోట్లు తీసుకొస్తే రేవంత్ రెడ్డి ఫొటో పెడతామని అన్నారు. మరికొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు పింఛ న్లు ఇస్తే పెడతామంటూ సూచించారు. చివరకు చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి, కమిషనర్ ఖదీర్ పాష ఇతర మున్సిపాలిటీల్లో ఎలా ఉందో తెలుసుకొని నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో వివాదం సర్దుమనిగింది.
కో ఆప్షన్ సభ్యులకు బీఆర్ఎస్ నేతల సన్మానం
సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్కు నూతనంగా ఎంపికైన కోఆప్షన్ సభ్యులు నంది శంకర్, కొండ అనుష, సయ్యద్ సోహెల్, సయ్యద్ తస్లీమ్లను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షు డు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, మాజీ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి మ్యాన రవి, కౌన్సిలర్లు సన్మానించారు.
బీఆర్ఎస్లో అసంతృప్తి
సిరిసిల్ల మున్సిపల్ కోఆప్షన్ పదవులు బీఆర్ఎస్ నాయకుల్లో అసంతృప్తికి దారి తీసింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్తో సహా పార్టీ పెద్దలు కౌన్సిలర్ పదవులు ఆశిస్తూ ముందుకు వచ్చిన ఆశావహులను బుజ్జగిస్తూ పోటీ నుంచి తప్పించారు, ఆ సందర్భంలో కొంతమందికి కో ఆప్షన్ పదవులపై ఆశలు కల్పించినట్లు చెప్పుకుంటున్నారు, సిరిసిల్ల మున్సిపల్ 39 వార్డుల్లో 27వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు ఎంతో శ్రమించారని చెప్పుకోవచ్చు. జిల్లాలో మరో మున్సిపాలిటీ వేములవాడలో బీఆర్ఎస్ కేవలం ఐదుగురు మాత్రమే గెలుచుకోగలిగింది. అందులో ఒకరు కాంగ్రెస్లో చేరారు. సిరిసిల్లలో ఏకపక్షంగా గులాబీ జెండా ఎగరవేయడంలో కీలకంగా పనిచేసే కో ఆప్షన్ పదవుల వచ్చేసరికి భంగపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని వీడకుండా జెండాలు మోస్తూ నిరంతరంగా పనిచేస్తున్న వారిని కాదని కేవలం ఎన్నికల సమయంలో తెరపైకి వచ్చే వారికే పార్టీలో గుర్తింపు ఉంటుం దనే భావన పార్టీలో పెరుగుతోంది. పార్టీ విధేయతకు కాకుండా నాయ కుల విధేయులకు పదవులు వచ్చాయని బహటంగానే చెప్పుకుం టున్నారు.