Share News

విద్యుత్‌ బస్సులతో ప్రజలు, కార్మికులపై పెనుభారం

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:05 AM

విద్యుత్‌ బస్సులతో ప్రజలు, కార్మికులపై పెను భారం పడుతుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి అన్నారు.

విద్యుత్‌ బస్సులతో ప్రజలు, కార్మికులపై పెనుభారం
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి

భగత్‌నగర్‌, మార్చి 22(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ బస్సులతో ప్రజలు, కార్మికులపై పెను భారం పడుతుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని ముకుందలాల్‌ మిశ్రా భవన్‌లో విద్యుత్‌ వస్తు విధానం ప్రజలు, కార్మికులపై పడే భారంపై సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంవీ యాక్ట్‌ సవరణ 2019 విద్యత్‌ బస్సుల విధానంతో రాష్ట్రల హక్కులను కేంద్ర ప్రభుత్వం లాక్కున్నదన్నారు. బస్సుల కొనుగోలు నిర్వహణ, ఆపరేషన్‌ అన్ని ప్రైవేట్‌ కంపెనీలే చూస్తాయన్నారు. ఒప్పందం ప్రకారం బస్సు తిప్పినా.. తిప్పక పోయినా ప్రతి నెలా విద్యుత్‌ బస్సుల కంపెనీలకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కరీంనగర్‌-2 డిపో నుంచి నడుస్తున్న బస్సులకు జిసిసి పద్ధతిలో కిలోమీటర్‌కు 39.8 రూపాయలు చెల్లిస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం రెడు శాతం పెంచేలా ఒప్పందం జరిగిందన్నారు. మొత్తం ఖర్చు 54.80 రూపాయలుగా ఉందన్నారు. విద్యుత్‌ బస్సుల్లో వంద కిలోమీటర్ల లోపు ప్రయాణిస్తున్న ప్రయాణికులు 10, ఆపైన 20 రూపాయలు ప్రతి ప్రయాణికుడు చెల్లిస్తున్నారన్నారు. విద్యుత్‌ బస్సులు పెరుగుతున్నా కొద్ది ఈ భారం ప్రజలపై మరింత పెరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన విద్యుత్‌ బస్సుల విధానంలో మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. జీసీసీ పద్ధతిని రద్దు చేసి అన్ని సబ్సిడీలను ఆర్టీసీలకు అప్పగించాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యు శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్‌, సహాయ కార్యదర్శి పున్నం రవి, కోశాధికారి జి రాజేశం, మెడికల్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్‌ యూనియన్‌ నాయకులు జి శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, ఇన్సురెన్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు రామ్మోహన్‌, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ నాయకులు పి మల్లయ్య, రైస్‌ మిల్‌ ఆపరేటర్స్‌ యూనియన్‌ నాయకులు సిహెచ్‌ భద్రయ్య పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 12:05 AM