కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రశాంతం
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:31 PM
కరీంనగర్ నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల శనివారు ప్రశాంతంగా జరిగింది. నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఐదుగురు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక శనివారం నిర్వహించారు.
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల శనివారు ప్రశాంతంగా జరిగింది. నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఐదుగురు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక శనివారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీతోపాటు ముగ్గురు బీఆర్ఎస్ సభ్యులు కూడా మద్దతు తెలుపుతూ చేయి ఎత్తి బలపరచడంతో ఐదు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కన్న కృష్ణ, చిగిరి వెంకటమ్మ, ఎలగందుల నందకుమార్, బల్బీర్సింగ్, ఆఫిజాబేగం కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరు మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కో ఆప్షన్ సభ్యులకు డిప్యూటీ కమీషనర్ వేణు ధ్రువీకరణపత్రాలను అందించారు. గెలిచిన అభ్యర్థులకు మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీకి చెందిన 34 మంది పాలక వర్గ సభ్యులు, బీఆర్ఎస్కు చెందిన మరో ముగ్గురు సభ్యులు మద్దతు ప్రకటించారు. కన్న కృష్ణ, చిగిరి వెంకటమ్మ, బల్బీర్సింగ్కు 36 ఓట్ల చొప్పున రాగా, ఎలగందుల నందకుమార్, ఆఫీజా బేగంకు 37 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ నలర పాలక సంస్థ అభివృద్ధిలో కో ఆప్షన్ సభ్యుల సేవలు కీలకమని అన్నారు. బీజేపీ తరుపున బరిలో నిలిచిన ఐదుగురు కోఆప్షన్ సభ్యులు విజయం సాధించడంతో తమ పాలకవర్గానికి మరింత బలం చేకూరిందని తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో కరీంనగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై సునీల్రావు, కార్పొరేటర్లు, అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్లు వేణుమాధువ్, ఖాదర్ మొహియుద్దీన్ పాల్గొన్నారు.