ప్రజల భద్రత విషయంలో రాజీ పడొద్దు...
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:43 AM
ప్రజల భద్రత విషయంలో రాజీ పడొద్దని, రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు.
కరీంనగర్ క్రైం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ప్రజల భద్రత విషయంలో రాజీ పడొద్దని, రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్పర్సన్ గా కలెక్టర్ మాట్లాడారు. అధికారులు ప్రధాన రహదారులను తరచుగా తనిఖీలు చేస్తూ.. ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. సీసీ ప్యాచ్వర్క్లు, మేజర్ అప్రోచ్ రోడ్డు పనులు, రద్దీ ప్రాంతాల్లో ఓపెన్ డ్రైనేజీ తదితర సమస్యల గురించి చర్చించారు. ఆర్ఓబీ వద్ద సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్పొరేషన్ పరిధిలో సర్కిల్ వారీగా తనిఖీలు చేస్తూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. గణేష్ ఉత్సవాలకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీపీ గౌస్ అలం మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు, ఈ చలాన్లు, హిట్ అండ్ రన్ కేసుల విషయాలు వివరించారు.
ఫ మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి
కరీంనగర్ క్రైం: ప్రతి ఒక్కరూ బాధ్యతగా మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నార్కోటిక్స్ జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్తో కలిగే దుష్పరిణామాలపై ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తరచూ హాస్టళ్లను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. పోలీస్ శాఖ తరపున డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. డీడబ్ల్యువో సరస్వతి మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో వారానికి మూడుసార్లు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.