ముగిసిన జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:00 AM
జిల్లాస్థాయి షెడ్యూల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. జిల్లా కేంద్రంలోని బ్యాడ్మింటన్ అకాడమీలో రెండు రోజులపాటు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
కరీంనగర్ స్పోర్ట్స్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాస్థాయి షెడ్యూల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. జిల్లా కేంద్రంలోని బ్యాడ్మింటన్ అకాడమీలో రెండు రోజులపాటు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల ముగింపు సమావేశానికి బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై మహేందర్ రావు ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు పతకాలను, ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభచాటి జిల్లా క్రీడా పతాకాన్ని ఎగురవేయాలన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు జిల్లా అసోసియేషన్ సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శి సిరి రవి, పోటీల నిర్వహణ కార్యదర్శి జి ఆనంద్కుమార్, సీనియర్ క్రీడాకారులు సీహెచ్ రాజన్బాబు, అవినాష్, గంగరాజు, కౌశిక్ రావు, ప్రేమ్ కుమార్, లక్ష్మణ్, అనిల్, లావణ్య పాల్గొన్నారు.
ఫ పోటీల ఫలితాలు...
సీనియర్స్ విభాగంలో వైభవ్ మనసూరి ప్రథమ స్థానం, తన్మయి నిహాల్ ఉత్తమ్ ద్వితీయ స్థానం సాధించారు. అండర్-19 బాలుర సింగిల్స్లో తన్మయి నిహాల్ ఉత్తమ్ ప్రథమ స్థానం, గండ్ర శ్రీధన్రావు ద్వితీయ స్థానాలు సాధించారు. డబుల్స్ విభాగంలో హర్ష, ప్రసన్న ప్రథమ స్థానం సాధించారు. స్టీఫెన్ సూర్య, అచ్యుతరావు ద్వితీయ స్థానం సాధించారు. అండర్-17 బాలుర సింగిల్స్లో సంజయ్ ప్రథమ స్థానం, శ్రీధన్రావు గండ్ర ద్వితీయ స్థానం సాధించారు. డబుల్స్ విభాగంలో శ్రీవాస్తవ్, ఆశ్రిత్ ప్రథమ స్థానం సాధించగా, నాగచైతన్య, విఘ్నేశ్వర్ ద్వితీయ స్థానం సాధించారు. ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.