డీఎంఎఫ్టీ బిల్లుల్లో జాప్యం..
ABN , Publish Date - Apr 25 , 2026 | 01:52 AM
ఇసుక, కంకర, గ్రానైట్, బొగ్గు, తదితర సహజ వనరుల సద్వినియోగం వల్ల డిస్ట్రిక్ట్ మినరల్ ట్రస్టు ఫండ్ (డీఎంఎఫ్టీ) నిధులను సకాలంలో జిల్లాకు ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీంతో పనులు చేసిన కాం ట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిల్లుల కోసం ప్రతీ రోజు ఇంజ నీరింగ్ కార్యాలయాల చుట్టూ తిరుతున్నారు. జిల్లాలో వివిధ పట్టణాలు, మండలాల్లో పూర్తి చేసిన పనులకు సంబంధించి 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది.
- పెండింగులో రూ. 50 నుంచి 60 కోట్ల బిల్లులు
- కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న కాంట్రాక్టర్లు
- ఏడేళ్లుగా ప్రభుత్వ ఖాతాకే సింగరేణి నిధులు
- జిల్లాకు రావాల్సిన నిధులను ఇతర జిల్లాలకు తరలిస్తున్న ప్రభుత్వం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఇసుక, కంకర, గ్రానైట్, బొగ్గు, తదితర సహజ వనరుల సద్వినియోగం వల్ల డిస్ట్రిక్ట్ మినరల్ ట్రస్టు ఫండ్ (డీఎంఎఫ్టీ) నిధులను సకాలంలో జిల్లాకు ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీంతో పనులు చేసిన కాం ట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిల్లుల కోసం ప్రతీ రోజు ఇంజ నీరింగ్ కార్యాలయాల చుట్టూ తిరుతున్నారు. జిల్లాలో వివిధ పట్టణాలు, మండలాల్లో పూర్తి చేసిన పనులకు సంబంధించి 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. మూడు మాసాల నుంచి ఒక్క రూపాయి కూడా బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. జిల్లాలో గల సింగరేణి గనులు, ఓపెన్కాస్టుల ద్వారా వెలికి తీసే బొగ్గు ద్వారా ఆ సంస్థ డీఎంఎఫ్టీ కింద 30 శాతం డబ్బులను జిల్లా కలెక్టర్ ఖాతాలోనే జమ చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి అధికారులు నేరుగా ప్రభుత్వ ఖాతాకే డబ్బులు జమ చేస్తున్నారు.
ఫ పక్క జిల్లాలకు తరలింపు
2019 నుంచి జిల్లాకు సుమారు 550 కోట్ల రూపాయలకు పైగా జిల్లా ఖాతాలో ఫండ్ జమ కావాల్సి ఉండగా కావడం లేదు. దీంతో జిల్లాలో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. వాస్తవానికి జిల్లాలో గల సహజ వనరుల ద్వారా డీఎంఎఫ్టీకి జమయ్యే నిధులను జిల్లా అవస రాలకు, ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి వెచ్చించాలనే నిబంధన ఉంది. అయితే గత ప్రభుత్వం జిల్లాకు జమ అయిన నిధులను జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు సుమారు 260 కోట్ల రూపాయలకు పైగా తరలిపోయాయి. 300 కోట్లకు పైగా సీఎం రిలీఫ్ఫండ్కు వినియోగిం చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా పాత విధానంలోనే డీఎంఎఫ్టీ నిధులను నేరుగా ప్రభుత్వ ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. గడిచిన రెండేళ్లలో జిల్లాలో డీఎంఎఫ్టీ ద్వారా 120 కోట్ల రూపాయలకు పైగా పలు అభివృద్ధి పనుల కోసం మంజూరు చేశారు. రహదారుల నిర్మాణాలు, ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, ప్రహరీ, మరుగుదొడ్లు, ఇతర మరమ్మతులు, సమ్మక్క సారలమ్మ జాతర సం దర్భంగా పలు చోట్ల బీటీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు పనులు పూర్తయినా బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. అప్పులు తీసుకవచ్చి పనులు చేస్తే బిల్లులు రాకపోవడంతో వడ్డీలు తడిసి మోపెడు అవుతున్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
ఫ యేటా రూ.75 నుంచి 85 కోట్లు జమ..
జిల్లాలో సహజ వనరుల ద్వారా డీఎంఎఫ్టీ కింద యేటా 75 కోట్ల నుంచి 85 కోట్ల రూపాయల వరకు వస్తాయి. ఈ డబ్బులు మొత్తం నేరుగా జిల్లా ఖాతాలోనే జమ కావాల్సి ఉండగా, అలా జరగడం లేదు. డీఎంఎఫ్టీ కింద జిల్లాకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్ సింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి విన్నవించారు. కానీ నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. జిల్లాలోని సహజ వనరుల ద్వారా వచ్చే డీఎంఎఫ్టీ నిధులను జిల్లాలో పలు అభివృద్ధి పనులకే జమ చేస్తే మాత్రం ప్రభుత్వం ఇతరత్రా నిధులను విడుదల చేయాల్సిన అవసరం ఉండదని ప్రజాప్రతినిధులు అంటున్నారు. ప్రభు త్వం వెంటనే స్పందించి డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించే విధంగా నిధులను విడుదల చేయాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.