Share News

మూల మలుపులు.. ప్రమాదాలకు నెలవులు

ABN , Publish Date - May 25 , 2026 | 12:30 AM

మండలంలోని పలు గ్రామల్లో ప్రమాదకరంగా ఉన్న మూల మలుపులు వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

మూల మలుపులు..  ప్రమాదాలకు నెలవులు

వేములవాడ రూరల్‌, మే 24 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పలు గ్రామల్లో ప్రమాదకరంగా ఉన్న మూల మలుపులు వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఫాజుల్‌నగర్‌ ఎల్లమ్మ ఆలయం వద్ద, నాగాయపల్లి వద్ద మూలమలుపులు ప్రమాదాలకు నెలవుగా మారాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫాజుల్‌నగర్‌ ఎల్ల మ్మగుడి వద్ద కల్వర్టు దాటిన తర్వాత మూలమలుపు వద్ద ఎలాంటి సూచికబోర్డులు లేవు. నాగాయపల్లి వద్ద పోలీసు అధికారులు బారీకేడ్లను ఏర్పాటు చేసినప్పటికి శివరాత్రి సమయంలో తొలగించారు. తిరిగి బారీకేడ్లను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు పోలీసు అధికారులను కోరారు. గతంలో ఇదే మూలమలుపు వద్ద మర్రిపల్లి కేజీబీవీలో చదివే విద్యార్థినులు పదో తరగతి పరీక్షలు రాయడానికి వేములవాడకు వెళ్తుండగా ఆటో బోల్తాపడి తీవ్ర గాయాలపాలయ్యారు. వేములవాడ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టుకు వెళ్లే రహదారి, కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారి కావడంతో రెండు రహదారులు ఎప్పు డూ వాహనాలతో రద్దీగా ఉంటాయి. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని, మూలమలుపుల వద్ద బారీకేడ్లు, సూచిక బోర్డు లు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.

బారీకేడ్లను ఏర్పాటు చేయాలి : తోట శేఖర్‌, పోశెట్టిపల్లి

కొన్ని నెలల క్రితం పోలీసు అధికారులు మూల మలుపు వద్ద బారీకేడ్లను ఏర్పాటు చేశారు. కానీ కొద్ది రోజుల క్రితం తొలగించారు. కోరుట్ల-వేములవాడ ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. గతంలో మూలమలుపు వద్ద చాలా ప్రమాదాలు జరిగాయి. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం జరగక ముందే నాగాయపల్లి మాల మలు పు వద్ద తిరిగి బార్‌గేట్లను ఏర్పాటు చేయాలి.

Updated Date - May 25 , 2026 | 12:30 AM