Share News

క్యాంపు రాజకీయాలు

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:11 AM

జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డులు ఉండగా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కాంగ్రెస్‌ 23 స్థానాల్లో, బీజేపీ 6, బీఆర్‌ఎస్‌ 4, ఎంఐఎం 2, స్వతంత్రులు 15 మంది విజ యం సాధించారు.

క్యాంపు రాజకీయాలు

ఫ జగిత్యాల, మెట్‌పల్లి, రాయికల్‌ బల్దియాల్లో హంగ్‌

ఫ జగిత్యాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రత్యేక నజర్‌

ఫ మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ల మధ్య సయోధ్యకు చర్చలు

జగిత్యాల, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డులు ఉండగా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కాంగ్రెస్‌ 23 స్థానాల్లో, బీజేపీ 6, బీఆర్‌ఎస్‌ 4, ఎంఐఎం 2, స్వతంత్రులు 15 మంది విజ యం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యతను చాటుకున్నప్పటికీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు అవసరమైన 26 మ్యాజిక్‌ ఫిగర్‌ను అందులేక పోయింది. దీనికి తోడు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు రెండు గ్రూపులుగా చీలిపో యారు. కాంగ్రెస్‌కు చెందిన 23మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి చెందిన రెండు గ్రూపులుగా చీలిపోయారు. కాంగ్రెస్‌ బీఫామ్‌పై పోటీ చేసి గెలిచిన 23 మందిలో ఏడుగురు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి వర్గీయులు, 16 మంది ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ వర్గీయులు ఉన్నారు. స్వతంత్ర కౌన్సిలర్లలో ముగ్గురు బీజేపీ రెబల్స్‌ కాగా, 10 మంది మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అనుచరులు, ఇద్దరు ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అనుచరులు ఉన్నారు. విజేతలతో పోటా పోటీగా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పోటాపోటీగా క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్నారు. ఏఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవిని చేజిక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఫహైదరాబాద్‌కు చేరిన జగిత్యాల పంచాయితీ

హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌ వేదికగా జగిత్యాల మున్సిపల్‌ పదవుల పంచాయితీ చోటుచేసుకుంది. జగిత్యాల కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న పరిస్థితిని చక్కదిద్దడానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రంగంలోకి దిగారు. ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్‌, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌తో సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి ప్రజా భవన్‌లో సమావేశమయ్యారు. మున్సిపల్‌ పీఠంపై చర్చలు జరిపారు. జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ల మద్య సయోధ్య కుదిర్చేందుకు నేతలు ప్రయత్నాలు చేశారు. జగిత్యాల కాంగ్రెస్‌ పదవుల పంచాయతీని సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తీసుకువెళ్లినట్లు సమాచారం. ఓ వర్గానికి చైర్మన్‌, మరో వర్గానికి వైస్‌ చైర్మన్‌ ప్రతిపాదనలను అధిష్ఠానం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో ఆరంభం నుంచి ఉండి బలోపేతానికి కృషి చేసిన తమ వర్గం కార్యకర్తకే ప్రాధాన్యం ఇవ్వాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అధిషా ్ఠనానికి నిర్ణయం తెలిపాను.. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని జీవన్‌రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే సంజయ్‌ వర్గంతోనూ సీనియర్‌ నేతలు చర్చలు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్దకు సైతం జగిత్యాల కాంగ్రెస్‌ జగడం వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

ఫ ముఖ్యమంత్రి దృష్టికి పరిస్థితి..

జగిత్యాల కాంగ్రెస్‌ పదవుల పంచాయితీని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తీసుకువెళ్లినట్లు సమాచారం. మాజీ మంత్రి జీవన్‌రెడ్డితో జరిపిన చర్చల సందర్భంగా వెలుగులోకి వచ్చి అంశాలను సీఎం రేవంత్‌రెడ్డికి వివరించినట్లు తెలిసింది. ఓ వర్గానికి చైర్మన్‌, మరో వర్గానికి వైస్‌ చైర్మన్‌ ప్రతిపాదనలను అధిష్ఠానం చేసినట్లు తెలుస్తోంది. దీంతో రెండున్నర సంవత్సరాలు ఓ వర్గం చైర్మన్‌గా, మరో రెండున్నర సంవత్సరాలు మరో వర్గం చైర్మన్‌గా అవకాశం తీసుకోవాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ప్రతిపాదనలకు ఇరు వర్గాలు ససేమిరా అన్నాయని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఫోన్‌ చేసి మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది.

ఫమెట్‌పల్లి, రాయికల్‌లో ఉత్కంఠ

జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి, రాయికల్‌ మున్సిపాలిటీల్లో హంగ్‌ ఫలితాలు వచ్చాయి. ఈరెండు చోట్ల బీజేపీ అధిక సీట్లను కైవసం చేసుకున్నప్పటికీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ దక్కలేదు. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పొత్తులతో పీఠం దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. రెండు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు క్యాంపులు నిర్వహిస్తున్నాయి. మెట్‌పల్లిలో 26 మంది కౌన్సిలర్లకు గాను మ్యాజిక్‌ ఫిగర్‌ 14ను ఏ పార్టీ దక్కించుకోలేకపోయింది. మెట్‌పల్లిలో 10 బీజేపీ, 6 బీఆర్‌ఎస్‌, 6 కాంగ్రెస్‌, 4 స్వతంత్రులు గెలుపొందారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌, స్వతంత్రుల మద్దతుతో బీజేపీ విజయ కేతనం ఎగురవేస్తుందన్న అంచనాలున్నాయి. కాగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు అంగీకారానికి వచ్చి కాంగ్రెస్‌ చైర్మన్‌ పీఠం దక్కించుకుంటుందన్న మరో అభిప్రాయం వినిపిస్తోంది. రాయికల్‌ మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను 3 కాంగ్రెస్‌, 5 బీజేపీ, 3 బీఆర్‌ఎస్‌, 1 స్వతంత్రులు గెలుపొందారు. మ్యాజిక్‌ ఫిగర్‌కు అవసరమైన 7 స్థానాలు ఏ పార్టీకి రాలేదు. దీంతో మూడు ప్రధాన పార్టీలు ఎవరికి వారు క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. బీఆర్‌ఎస్‌ పొత్తుతో బీజేపీ జెండా ఎగురవేయడానికి ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ లో సైతం మైత్రి కుదుర్చుకుంటున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది.

Updated Date - Feb 16 , 2026 | 01:11 AM