రోగులకు మెరుగైన సేవలు అందించాలి
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:08 AM
ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్ సూచించారు.
ఎల్లారెడ్డిపేట, ఆగస్టు11(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్ సూచించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు బొప్పాపూర్లోని ఆయుష్మార్ ఆరోగ్య మందిర్ను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. రికార్డులు, ఓపీ, ఐపీ విభాగాలు, ప్రసూతి వార్డు, ఆపరేషన్ థియేటర్, మందుల నిల్వ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. బొప్పాపూర్లో వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఎన్క్యూఏఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. వ్యాధుల పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయాలని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో అనవసర వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు చేయకుండా వైద్య నైతిక విలువలు పాటించాలని సూచించారు. సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని అన్నారు. పరిశుభ్రత, రోగుల భద్రతను మెరుగు పర్చాలని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫైడ్ అన్నారు. ఆమె వెంట డిప్యూటీ జిల్లా వైద్యాధికారి నాగేంద్రబాబు, ప్రోగాం అధికారి రామకృష్ణ, పీహెచ్సీ వైద్యాధికారి సారియఅంజుమ్, తదితరులు ఉన్నారు.