Share News

ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:18 AM

యాసంగి సీజన్‌లో ఽధాన్యం సేకరణకు పకడ్బందీగా ఏర్పాట్లుచేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

సిరిసిల్ల అర్బన్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : యాసంగి సీజన్‌లో ఽధాన్యం సేకరణకు పకడ్బందీగా ఏర్పాట్లుచేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం యాసంగి ధాన్యం 2025-26 కొనుగోళ్లపై సంబంధిత అధికారులు, రైస్‌మిల్లర్లు, ట్రాన్స్‌ పోర్ట్‌ కాంట్రాక్టర్‌లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ధాన్యం సేకరణపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత లేకుండా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ మాట్లాడుతూ.. జిల్లాలో నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుం దని వ్యవసాయ అధికారులు అంచనా వేశారని, దాదాపు 2లక్షల 70వేల నుంచి 3లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. ఐకేపీ 159, , పీఏసీ ఎస్‌ 73, డీసీఎంఎస్‌ 1, మెప్మా ఆధ్వర్యంలో 7 మొత్తం 240 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. టార్పాలిన్లు 5వేల 839, తేమ యంత్రాలు 507, ఎలకా్ట్రనిక్‌ వేయింగ్‌ స్కేల్స్‌ 700, ప్యాడీ క్లీనర్లు 606, డిజిటల్‌ గైన్స్‌ క్యాలివర్స్‌ 270, హస్క్‌ రిమూవర్‌ 270, డ్రైయర్లు 2 అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆటోమేటిక్‌ ప్యాడీ క్లీనర్లు త్వరలో పంపిణీ చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. వరి కోతలకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కొనుగోలు కేంద్రా ల్లో టెంట్లు, నీటి సౌకర్యం, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించార. ప్రతి కొనుగోలు కేంద్రంలో మద్దతు ధర, రైతులకు సూచనలు చేసే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతుల పంట కోతలకు అనుగుణంగా టోకెన్‌లు ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం తరలించేలా అవగాహన కల్పించాలని సూచించారు. అకాల వర్షాల వివరాలు ఈసారి వాతావరణ శాఖ నుంచి ఎప్పటికప్పుడు ఇస్తామ న్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్‌ మిల్లర్లు అప్రమత్తంగా ఉండాల ని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు వివరాలు ఆన్‌లైన్‌ చేసి రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలని సూచించారు కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌ మిల్లులకు వచ్చే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు దిగుమతుల చేసుకుని సహకరించాలని, లారీల కాంట్రాక్టర్లు తాము అగ్రిమెంట్‌ ప్రకారం వాహనాలు అందు బాటులో పెట్టాలని, రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలని, రవాణా శాఖ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.

గడువులోపు సీఎంఆర్‌ అందించాలి..

రైస్‌ మిల్లర్లు సీఎంఆర్‌ బియ్యంను గడువులోగా అందించాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. యాసంగి సీజన్‌ ధాన్యానికి బ్యాంక్‌ గ్యారంటీలు అందించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యం దించుకునేందుకు హమాలీలను నియమించాలని, ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు. రైస్‌మిల్లర్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, డీసీఎస్‌ఓ బుచ్చి బాబు, మేనేజర్‌ నరసింహ, డీఆర్డీఓ గీత, వ్యవసాయ, సహకార శాఖ అధికారులు, రైస్‌ మిల్లర్లు, వ్యవసాయ, మెప్మా అధికారులు, పీఏసీఎస్‌ బాధ్యులు, లారీ కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 12:18 AM