మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:45 PM
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆద్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి రాజు అన్నారు. మంగళవారం కరీంనగర్ బస్టాండ్లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర క్యాంపును ప్రారంభించారు.
భగత్నగర్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆద్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి రాజు అన్నారు. మంగళవారం కరీంనగర్ బస్టాండ్లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ రీజియన్లో ఆరు ఆపరేటింగ్ పాయింట్ల నుంచిప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా కరీంనగర్ ఆపరేటింగ్ పాయింట్ నుంచి బస్సులు ప్రారంబించామన్నారు. మేడరం జాతర బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని తెలిపారు. మహిళా ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఆర్టీసీ బస్సులు సమ్మక్క గద్దెల వద్దకు వెళతాయన్నారు. సురక్షితం, సౌకర్యవంతమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలన్నారు. 24 గంటలు నడిచే ఈ క్యాంపులో తాగునీటి వసతి, మెడికల్ క్యాంపలు, ఇతర సౌకర్యాలు భక్తులకు కల్పించామన్నారు. పిల్లలు తప్పిపోయే ఘటనలు నివారించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఛైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్ను భక్తులు వినియోగించుకోవాలన్నారు. ఈ విధానం ద్వారా తప్పిపోయిన పిల్లలను త్వరగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంటుందన్నారు. ప్రత్యేక బస్సుల్లో పెద్దలకు 390, పిల్లలకు 220 రూపాయల చార్జీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్లు ఎస్ భూపతిరెడ్డి, పి మల్లేశం, డిపో మేనేజర్లు విజయమాదురి, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఎల్ మల్లేశం, సూపర్ వైజర్లు హిమబిందు, తిరుపతి, విజయలక్ష్మి, ఎంజి కిషన్, కమల, మాధవి, లక్ష్మి, సంపత్, సుజాత పాల్గొన్నారు.