Share News

‘కవల అణువుల్లో’ తేడాలను గుర్తించారు!

ABN , Publish Date - Jun 13 , 2026 | 06:48 AM

అద్దంలో ప్రతిబింబంలా కొన్ని అణువులు చూడటానికి ఒకే విధంగా ఉంటాయి కానీ అమరికలో తేడా ఉంటుంది. ఫలితంగా వాటి లక్షణాలు కూడా భిన్నంగా...

‘కవల అణువుల్లో’ తేడాలను గుర్తించారు!

  • లేజర్‌ కాంతి ప్రయోగాలతో వినూత్న పద్ధతిని అభివృద్ధిపరిచిన ఐఐటీహెచ్‌ శాస్త్రవేత్తలు

  • ఔషధాల తయారీ, బయోమెడికల్‌ రంగాల్లో ఉపయోగపడనున్న సాంకేతికత

కంది, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): అద్దంలో ప్రతిబింబంలా కొన్ని అణువులు చూడటానికి ఒకే విధంగా ఉంటాయి కానీ అమరికలో తేడా ఉంటుంది. ఫలితంగా వాటి లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఇటువంటి అణువులను ‘కైరల్‌ మాలిక్యూల్స్‌ లేదా మాలిక్యులర్‌ ట్విన్స్‌’ (కవల అణువులు) అని అంటారు. ఔషధాల తయారీలో, వాటి ప్రభావంలో వీటి పాత్ర కీలకం. ఈ కైరల్‌ మాలిక్యూల్స్‌లోని సూక్ష్మమైన తేడాలను గుర్తించే దిశగా సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. టీఐఎ్‌ఫఆర్‌ హైదరాబాద్‌, ఐఐటీ బాంబేతో కలిసి వీరు నూతన పద్ధతిని అభివృద్ధి పరిచారు. సాధారణ కాంతితో గుర్తించడం కష్టమైన అణువుల సూక్ష్మ లక్షణాలను.. ప్రత్యేకంగా మలిచిన కాంతి (ట్విస్టెడ్‌ లైట్‌)తో గుర్తించే విధానమే వీరి పరిశోధన ప్రత్యేకత. ట్విస్టెడ్‌ లేజర్‌ పల్సెస్‌ ద్వారా కైరల్‌ మాలిక్యూల్స్‌లోని భిన్న లక్షణాలను స్పష్టంగా గుర్తించవచ్చని ఈ పరిశోధకులు నిరూపించారు. అత్యంత తక్కువ పరిమాణంలో ఉన్న నమూనాలతోనే గరిష్ఠ కచ్చితత్వంతో ఫలితాలను ఇచ్చే ఈ సాంకేతికత.. భవిష్యత్తులో ఔషధాల తయారీ, డయాగ్నస్టిక్‌ పరీక్షలు, బయో మెడికల్‌ తదితర రంగాల్లో ఎంతగానో ఉపయోగపడనుందని భావిస్తున్నారు. ఈ పరిశోధనతో ఐఐటీ హైదరాబాద్‌ మరో సైంటిఫిక్‌ మైలురాయిని దాటిందని సంస్థ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి..

అమేథీ పంచాయతీ ఓటర్ల జాబితా నుండి స్మృతి ఇరానీ పేరు గల్లంతు

మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై దాడి.. ఇద్దరి అరెస్టు

Updated Date - Jun 13 , 2026 | 06:48 AM