Share News

ఆ భూమిలో సర్వే నిలిపివేతకు నో..

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:02 AM

మాజీ మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్‌రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం జీడిమెట్ల గ్రామంలోని....

ఆ భూమిలో సర్వే నిలిపివేతకు నో..

  • మల్లారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

మాజీ మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్‌రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం జీడిమెట్ల గ్రామంలోని సర్వే నెంబర్‌ 82లో ఉన్న 1.29 ఎకరాల భూమిలో సర్వే చేయకుండా రెవెన్యూ అధికారులను అడ్డుకోవాలని వారు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సోమవారం కొట్టేసింది. ఈ వివాదాస్పద భూమిని దులిచంద్‌ సిల్క్‌ మిల్స్‌ అనే కంపెనీ నుంచి తాము కొనుగోలు చేశామని మల్లారెడ్డి వాదిస్తుండగా, అందులో తనకు చెందిన 33 గుంటల భూమి ఉందని శేరి శ్రీనివా్‌సరెడ్డి అనే వ్యక్తి వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్‌ తహసీల్దార్‌ ఆధ్వర్యంలో భూమి సర్వే చేసి హద్దులు గుర్తించేందుకు సిద్ధమయ్యారు. ఈ సర్వేను అడ్డుకోవాలని మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ మౌషమీ భట్టాచార్య, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టి.. మల్లారెడ్డి పిటిషన్‌ను కొట్టేసింది.

Updated Date - Feb 03 , 2026 | 03:02 AM