13న సమ్మె నోటీసు ఇస్తాం: ఆర్టీసీ జేఏసీ
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:00 AM
ఎన్నికల హామీల అమలుతోపాటు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై తక్షణం ప్రభుత్వం స్పందించక పోతే....
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల హామీల అమలుతోపాటు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై తక్షణం ప్రభుత్వం స్పందించక పోతే ఈ నెల 13న సమ్మె నోటీసు ఇస్తామని టీజీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. ముషీరాబాద్లోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో మంగళవారం జేఏసీ సమావేశమైంది. గత నెల 24న తాము చేపట్టిన ‘చలో సచివాలయం’ కార్యక్రమంలో కార్మికుల ఆక్రందనలు, కష్టాలు చూశాకైనా సర్కారు స్పందిస్తుందన్న నమ్మకం ఉందని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామ్సరెడ్డి పేర్కొన్నారు. మరో పది రోజుల్లో తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రైవేటు విద్యుత్ బస్సుల స్థానంలో ఆర్టీసీ బస్సులు ప్రవేశ పెట్టాలని, ప్రైవేటు బస్సులకు ఆర్టీసీ డిపో స్థలాలు ఇవ్వరాదని వారు పేర్కొన్నారు. కార్మికులు సమ్మెకు వెళ్లకుండా నిలువరించాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని, తమను దూరం చేసుకోవద్దని జేఏసీ నేతలు వెంకన్న, థామ్సరెడ్డి తెలిపారు.