జడ్చర్ల ఆస్పత్రి ఘటనపై మంత్రి ఆగ్రహం
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:07 AM
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఓ వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్న ఘటనపై మంత్రి దామోదర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైద్య విధాన పరిషత్ కమిషనర్ విచారణ
మృతదేహం కుక్కలపాలైన ఘటనలో నలుగురి సస్పెన్షన్
హైదరాబాద్, జడ్చర్ల, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఓ వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్న ఘటనపై మంత్రి దామోదర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాలతో వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ బుధవారం జడ్చర్ల ఆస్పత్రికి వెళ్లి విచారణ చేపట్టారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకళ, ఆర్ఎంవో డాక్టర్ హరినాథ్, పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు మునీషా, వార్డుబాయ్ రవిప్రకాశ్ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోమవారం సాయంత్రం కుక్కలు లోపలికి వచ్చి మృతదేహాన్ని తిన్న వీడియోలు సోషల్మీడియాలో వచ్చాయని చెప్పారు. ఈ ఘటనపై చింతిస్తున్నామనితెలిపారు. కాగా జడ్చర్ల ఏరియా ఆసుపత్రిలో లేని పోస్టుకు బాధ్యుడిని చేసి తనను సస్పెండ్ చేశారని సివిల్ అసిస్టెంట్ సర్జన్ హరినాథ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్ఎంవోగా తనకు వర్క్ ఆర్డర్, హెడ్ ఆఫీస్ నుంచి, ఆసుపత్రి సూపరింటెండెంట్ నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవని పేర్కొన్నారు.