చికిత్స వివరాలివ్వనందుకు 15లక్షలు చెల్లించండి
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:50 AM
వ్యాధిగ్రస్థునికి అందించిన చికిత్స వివరాలను అతడి కుటుంబ సభ్యులకు సక్రమంగా వివరించకపోవడాన్ని సేవాలోపంగా వినియోగదారుల ఫోరం గుర్తించింది.
కార్పొరేట్ ఆస్పత్రికి ఫోరం ఆదేశం
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): వ్యాధిగ్రస్థునికి అందించిన చికిత్స వివరాలను అతడి కుటుంబ సభ్యులకు సక్రమంగా వివరించకపోవడాన్ని సేవాలోపంగా వినియోగదారుల ఫోరం గుర్తించింది. ఇందుకు రూ.15 లక్షల మేర పరిహారం చెల్లించాలని ఓ కార్పొరేట్ ఆస్పత్రిని ఆదేశించింది. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న మణికుమార్ 2024 ఆగస్టులో అనారోగ్యంతో ఆ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు. 10రోజుల పాటు చికిత్స పొంది మృతిచెందాడు. వైద్యఖర్చుల నిమిత్తం అతడి కుటుంబసభ్యులు ఆస్పత్రికి రూ. 2.28లక్షలు చెల్లించారు. అయితే ఆస్పత్రివర్గాలు చికిత్సకు సంబంధించి తగిన సమాచారం తమకు ఇవ్వలేదంటూ అతడి కుమార్తె వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. దీనిపై ఫోరం అధ్యక్షురాలు లతాకుమారి, సభ్యులు ఎస్.మాధవి, కాత్యాయని విచారణ జరిపారు. ఆస్పత్రికి చెల్లించిన బిల్లు రూ.2.28లక్షలను 9శాతం వడ్డీతో ఇవ్వాలని, కోర్టు ఖర్చుల కింద రూ.30వేలు, మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.15లక్షలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు.