Share News

హైదరాబాద్‌ హైస్పీడ్‌

ABN , Publish Date - Feb 02 , 2026 | 02:59 AM

రవాణారంగాన్ని ఉరకలెత్తించే లక్ష్యంతో దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లను ప్రకటించింది....

హైదరాబాద్‌ హైస్పీడ్‌

  • రాష్ట్రానికి 33 బాలికల హాస్టళ్లు

  • పన్నులు, సుంకాల్లో 0.72ు మేర పెరిగిన వాటా

  • వాటిద్వారా రాష్ట్రానికి రూ.33,180.78 కోట్ల ఆదాయం

  • సెమీ కండక్టర్ల మిషన్‌, మెడికల్‌ టూరిజం హబ్‌ ఊసు లేదు

  • రాష్ట్రం విజ్ఞప్తులను పట్టించుకోకపోవడంపై విమర్శలు

  • హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు, పుణెలకు హైస్పీడ్‌ రైళ్లు.. 300- 320 కి.మీ. వేగం

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): రవాణారంగాన్ని ఉరకలెత్తించే లక్ష్యంతో దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లను ప్రకటించింది. వీటిలో మూడు కారిడార్లు హైదరాబాద్‌తోనే అనుసంధానం కావడం.. దేశ చిత్రపటంలో హైదరాబాద్‌కు ఉన్న ప్రాధాన్యాన్ని స్పష్టం చేసింది! పుణె-హైదరాబాద్‌, హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-చెన్నై, ముంబై-పుణె, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారాణసీ, వారాణసీ-సిలిగురి నడుమ చేపట్టే ఈ రైల్వే కారిడార్లు రైల్వే అనుసంధానాన్ని మరింతగా పెంచనున్నాయి. ఈ కారిడార్లను ఆర్థిక మంత్రి అభివృద్ధి అనుసంధాన కేంద్రాలుగా ప్రకటించారు. వీటివల్ల ఆయా ప్రాంతాల అభివృద్ధి మరింత వేగవంతం కావటంతోపాటు నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయని అంచనాలున్నాయి. గంటకు 300-320 కి.మీ. వేగంతో నడిచే బుల్లెట్‌ ట్రెయిన్స్‌తో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుంది. వ్యాపార తదితర అవసరాల కోసం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుగానీ చెన్నైగానీ ప్రయాణించే వారు ఒకే రోజులో వెళ్లి పని చూసుకొని తిరిగి రావచ్చు. రైళ్లలో అధిక ప్రయాణ సమయం దృష్ట్యా.. విమానాలను ఎంచుకుంటున్నవారు ఇక మీదట హైస్పీడ్‌ రైళ్లలో ప్రయాణించటానికి ముందుకొచ్చే అవకాశాలున్నాయి. దీనివల్ల ప్రయాణికులకు డబ్బు ఆదా కావటమేగాక విమానాశ్రయాల మీద ఒత్తిడి తగ్గుతుంది. విమానాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలతో పోల్చితే రైళ్ల నుంచి వెలువడే ఉద్గారాలు 80ు తక్కువ. ఆ విధంగా పర్యావరణానికీ మేలు జరుగుతుంది. హైస్పీడ్‌ రైళ్లతో కంపెనీలు రెండో దశ (టైర్‌-2) నగరాలకు తమ ఆఫీసులను తరలించుకోవటానికి అవకాశం లభిస్తుంది. ఉద్యోగులు శివార్లు, చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఉంటూ మహా నగరాలకు వెళ్లి విధులు ముగించుకొని రావచ్చు. తద్వారా, మెగాసిటీలపై ఒత్తిడి తగ్గుతుంది. కాగా, ప్రతిపాదిత హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లతో మధ్య, దక్షిణ భారతాన్ని అనుసంధానించే కేంద్రంగా హైదరాబాద్‌ మారనుంది. అంతేకాదు.. దేశ మౌలిక సదుపాయాల రంగంలో అత్యంత కీలక రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని, తద్వారా దేశ రాజకీయాల్లో కూడా రాష్ట్రానికి ప్రాధాన్యం పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌, టూరిజం, లాజిస్టిక్స్‌, ఫార్మా, ఐటీ, నిర్మాణ, నిర్వహణ, సేవల రంగాల్లో 10-15 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణానికి పదేళ్ల సమయం పట్టవచ్చని సమాచారం. అలాగే.. జిల్లాకొక బాలిక హాస్టల్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాలకూ 33 బాలికల హాస్టళ్లు రానున్నాయి.


వీటి సంగతేంటి?

కేంద్ర బడ్జెట్‌ ద్వారా రాష్ట్రానికి కొన్ని ప్రయోజనాలు దక్కినప్పటికీ.. రాష్ట్రం చేపట్టిన పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు కేంద్రం నిధులు విదల్చలేదని, కొన్నింటికి సంబంధించి తాము చేసిన విజ్ఞప్తులనూ పట్టించుకోలేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు విమర్శిస్తున్నట్టు సమాచారం. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, మెట్రో, రీజనల్‌ రింగు రోడ్డు, హైదరాబాద్‌ నుంచి అమరావతి వరకూ చేపట్టే గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే, రీజినల్‌ రింగు రోడ్డు-ఔటర్‌ రింగు రోడ్డు మధ్య చేపట్టే రేడియల్‌ రోడ్లు, హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల మురికి నీటి వ్యవస్థలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌ సిటీల గురించి కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో మచ్చుకైనా ప్రస్తావించకపోవడంపైన.. జీఎ్‌సడీపీలో 4 శాతం మేర మార్కెట్‌ రుణాలు తీసుకునేలా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో వెసులుబాటు కల్పించాలని కోరినప్పటికీ ఆ వెసులుబాటు కల్పించకపోవడంపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో.. 4.3 శాతంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి మాత్రం అప్పులబాట పడతామని బడ్జెట్‌లో కేంద్రం పేర్కొనడంపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చుతున్నట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ సెమీకండక్టర్ల మిషన్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యమివాల్వని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని.. ‘ఎలకా్ట్రనిక్‌ కాంపొనెంట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ స్కీమ్‌ (ఈసీఎంఎ్‌స)’కు ఈ బడ్జెట్‌లో రూ.40 వేల కోట్లను కేటాయించిన కేంద్రం, దాని విషయంలో తెలంగాణ ఊసెత్తలేదని.. వైద్య పర్యాటకానికి పేరెన్నికగన్న హైదరాబాద్‌కు ఆ విషయంలోనూ కేంద్రం మొండిచేయే చూపిందని, దేశంలో ఏర్పాటు చేయనున్న ఐదు ప్రాంతీయ వైద్య పర్యాటక హబ్‌ ఏర్పాటు గురించి పట్టించుకోలేదని.. ఆ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఫార్మా రంగానికి కేంద్రంగా మారిన భాగ్యనగరినకి.. దేశంలో ఏర్పాటు చేయదల్చిన మూడు కెమికల్‌ పార్కుల్లో ఒక్కదాన్నీ కేటాయించకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. క్యాండియం, లిథియం వంటి అరుదైన ఖనిజాలు రాష్ట్రంలో లభిస్తున్నప్పటికీ.. రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ కారిడార్‌ను తెలంగాణకు కేటాయించకపోవడాన్ని తప్పుపడుతున్నాయి.


మరికొన్ని కేటాయింపులు

హైదరాబాద్‌లోని పలు కేంద్ర సంస్థలకు ఈ బడ్జెట్‌లో నిధులు ప్రకటించారు. అణు ఖనిజ వనరుల తవ్వకాలు, పరిశోధన సంస్థకు రూ.405.97 కోట్లు.. సముద్ర సమాచార సేవల జాతీయ కేంద్రానికి రూ.30 కోట్లు.. యానిమల్‌ బయెటెక్నాలజీ కేంద్రం, డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ కేంద్రం, వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీ, జాతీయ ఫిషరీస్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు, డీ డాక్‌, హిందీ డైరెక్టరేట్‌ తదితర సంస్థలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. నగర పాలక సంస్థలకు రూ.1000 కోట్ల మేర బాండ్ల ద్వారా నిధుల సమీకరణకు అవకాశం కల్పిస్తూనే రూ.100 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకం కల్పించడంతో తెలంగాణకు ప్రయోజనం చేకూరనుంది. రీజనల్‌ మెడికల్‌ టూరి జం కేంద్రాలను ప్రకటించడం, అమృత్‌ నిధులతో పట్ట ణ మౌలిక సదుపాయాలకు ఊతం కల్పించడం ద్వారా ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి. మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీలేని రుణాలు కల్పించాలని నిర్ణయించడం వల్ల.. తెలంగాణ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని భావిస్తున్నారు.

Updated Date - Feb 02 , 2026 | 02:59 AM