ఎస్సారెస్పీ కెనాల్లో ఇద్దరు యువకుల గల్లంతు
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:48 AM
హనుమకొండ యాదవనగర్ సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్లో మంగళవారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. కేయూ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): హనుమకొండ యాదవనగర్ సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్లో మంగళవారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. కేయూ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని చార్మినార్ ప్రాంతానికి చెందిన సోను (25), మస్తాన్ (20) రెండేళ్లుగా హనుమకొండలోని ఓ పండ్ల దుకాణంలో పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం పండ్ల వ్యర్థాలు పడేయడానికి ఎస్సారెస్పీ కెనాల్ ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో సోను కెనాల్లో పడిపోయాడు. కాపాడేందుకు వెళ్లిన మస్తాన్ కూడా గల్లంతయ్యాడు. వీరితో పాటు వెళ్లిన వాకిడి రమేశ్ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కేయూ పోలీసులు, హనుమకొండ ఏసీపీ నర్సింహరావు.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.