ప్రేమ వేధింపులకు బాలిక బలి
ABN , Publish Date - Sep 17 , 2026 | 04:50 AM
ప్రేమ పేరుతో ఓ యువకుడు, మరో బాలుడు వేధించడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన 17 ఏళ్ల బాలిక.. వారం రోజులుగా ఆస్పతిలో చికిత్స పొందుతూ చివరకు మరణించింది. ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘట న చోటుచేసుకుంది.
ప్రేమించాలంటూ యువకుడు, మరో బాలుడి వేధింపులు
తట్టుకోలేక ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం
వారం రోజులుగా ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతి
ఖమ్మం క్రైం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రేమ పేరుతో ఓ యువకుడు, మరో బాలుడు వేధించడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన 17 ఏళ్ల బాలిక.. వారం రోజులుగా ఆస్పతిలో చికిత్స పొందుతూ చివరకు మరణించింది. ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘట న చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. సదరు బాలిక తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లితో పాటే స్థానికంగా ఉంటూ కుటుంబ పోషణకు ఓ కిరాణా షాపులో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన ఎలక్ట్రిషియన్గా పనిచేసే పవన్ అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. ఇటు మరో 14 ఏళ్ల బాలుడు కూడా ఆమెతో నిత్యం మాట్లాడుతుండేవాడు. కొద్దిరోజులకు పవన్, ఆ బాలుడు ఇద్దరూ ఒకరి తెలియకుండా ఒకరు ప్రేమిస్తున్నామంటూ ఆమె వెంటపడ్డారు. ఇది నచ్చని ఆమె.. వారిని దూరం పెడుతూ వచ్చింది. అయితే ఆ బాలుడు ఆమెపై అసత్య ప్రచారాలు చేయడం ప్రారంభించాడు. ఇటు పవన్ వేధింపులు కూడా ఎక్కువవడంతో ఆ బాలిక విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది.
దీంతో కొద్దిరోజుల క్రితం బాలిక తల్లి పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టింది. అయినా వారి తీరు మారలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాలిక ఈనెల 8న ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. మరుసటి రోజు ఆమె అనారోగ్యం బారిన పడటంతో బాలిక విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో ఆమెను ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఆరోజు నుంచి అక్కడే చికిత్స పొందుతున్న బాలిక బుధవారం మృతి చెందింది. అంతకు ముందే బాలుడి వేధింపులు భరించలేక ఎలుక మందు తిన్నట్టు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఆ బాలుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తుండగా.. బాలికను వేధించిన వారిలో పవన్ కూడా ఉన్నాడని తెలియడంతో అతడిపైనా కేసు నమోదు చేసినట్టు సీఐ భానుప్రకాశ్ తెలిపారు.