మేమున్న పరిస్థితి అర్థం చేసుకోండి.. మీడియాతో మావోయిస్టు అగ్రనేత దేవ్జీ
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:01 PM
మావోయిస్టు అగ్ర నేతలు నలుగురు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. పోలీసులు నలుగురిని మంగళవారం మీడియా ముందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా దేవ్జీ మీడియాతో మాట్లాడుతూ..
హైదరాబాద్, ఫిబ్రవరి 24: మావోయిస్టు అగ్రనేతలు నలుగురు నేడు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి(పొలిట్ బ్యూరో కమిటీ మెంబెర్).. మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్(సెంట్రమ్ కమిటీ మెంబెర్).. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్(తెలంగాణ స్టేట్ సెక్రటరీ).. నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న సన్ను దాదా (స్టేట్ కమిటీ మెంబర్) పోలీసుల ముందు లొంగిపోయారు. పోలీసులు ఈ నలుగురినీ మంగళవారం మీడియా ముందుకు తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా దేవ్జీ మీడియాతో మాట్లాడుతూ.. ‘అనారోగ్య కారణాల రీత్యా నేను లొంగిపోయాను. రహస్య జీవితం నుంచి బహిరంగ జీవితం గడపాలని భావిస్తున్నాను. దశాబ్దాల కాలం నుంచి నేను నమ్మిన సిద్ధాంతాల ప్రకారమే ప్రజల కోసం పనిచేస్తాను. ప్రజల సమస్యలపై ప్రజల్లో ఉండి పోరాటం చేస్తాను. త్వరలో రాజకీయ ప్రవేశం చేసి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని భావిస్తున్నాను. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే పరిస్థితిలో లేను. నేను ఏది మాట్లాడినా అపార్థాలకు దారితీసే విధంగా ఉంటుంది. నేను రాజకీయ జీవితం కొనసాగించాలని కోరుకుంటున్నాను. మీరడిగే ప్రశ్నలకు నేను చెప్పే జవాబు.. రాజకీయ జీవితానికి ఇబ్బంది కలిగించవద్దని అన్ని విషయాలు పంచుకోవడం లేదు’ అని అన్నారు.
త్వరలో అన్ని ప్రశ్నలకు జవాబు: మల్ల రాజిరెడ్డి
మల్లా రాజిరెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రజలతో కలిసి పనిచేయాలని భావిస్తున్నాం. ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తాం. చట్ట ప్రకారమే పోరాటం చేయాలని లొంగిపోయాం. మావోయిజం అనేది ఎప్పటికీ అంతం కాదు. కొన్ని ప్రశ్నలను ప్రభుత్వంతో చర్చిస్తాం. త్వరలో అన్ని ప్రశ్నలకు జవాబు చెప్తాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
సూచీలకు భారీ నష్టాలు.. వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్..
దారుణం: కన్న బిడ్డను కట్టెల పోయిలో వేసి కాల్చి చంపిన తల్లి