రేపటి నుంచి దోస్త్ రిజిస్ర్టేషన్ ప్రారంభం
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:31 AM
రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్....
మూడు విడతల్లో డిగ్రీ సీట్ల భర్తీ
జూలై 1 నుంచి తరగతులు
రాష్ట్రవ్యాప్తంగా 969 కాలేజీల్లో 4.4 లక్షల సీట్లు
హైదరాబాద్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) షెడ్యూల్ వెలువడింది. సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి అధ్యక్షుడు, దోస్త్ కన్వీనర్ ఆచార్య బాలకిష్టారెడ్డి, మండలి ఉపాధ్యక్షులు పురుషోత్తం, ఎస్కే.మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేష్ షెడ్యూల్ను విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణ మూడు విడతల్లో జరగనుంది.
ఈ నెల 15 నుంచి మే7లోపు దోస్త్ అధికార వెబ్సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నెల 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్లు ఉంటాయి. మే14న మొదటి విడత ప్రకటిస్తారు.
రెండో విడత దరఖాస్తుల స్వీకరణ మే15 నుంచి 25 వరకు ఉంటుంది. మే 30న రెండో విడత జాబితా విడుదల చేస్తారు.
మూడో విడత ప్రక్రియ మే 31న ప్రారంభమై జూన్15న ముగియనుంది.
తుది విడత సీట్ల కేటాయింపు జూన్ 20న ఉంటుంది. దరఖాస్తు రుసుము 200గా ఉంది.
అన్ని విడతల్లో సీట్లు పొందినవారికి జూన్ 29, 30 తేదీల్లో ఓరియెంటేషన్ తరగతులుంటాయి.
జూలై 1 నుంచి 2026-27 విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని బాలకిష్టారెడ్డి తెలిపారు.
సీటు ఖరారైన విద్యార్థులు సంబంధిత కాలేజీకి వెళ్లి ధ్రువీకరణ పత్రాలు సమర్పించి.. ఫీజు చెల్లించి ప్రవేశం పొందాల్సి ఉంటుంది.
సీటు ఖరారైనా చేరేందుకు అనాసక్తిగాఉన్న విద్యార్థులు రిజర్వేషన్ ఫీజు చెల్లించి తదుపరి విడతలో దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ తెలిపారు.
అందుబాటులో 4,40,107 సీట్లు..
దోస్త్ కౌన్సిలింగ్తో మొత్తం 969 కాలేజీల్లో 4,40,107 సీట్లు భర్తీ చేయనున్నారు. వీటిలో 119 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 49,530 సీట్లు, 34 ప్రభుత్వ (అటానమస్) కాలేజీల్లో 39,480 సీట్లు, 635 ప్రైవేటు కాలేజీల్లో 2,62,770 సీట్లు, 26 ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీల్లో 10,920 సీట్లు, ఆరు వర్సిటీ కాలేజీల్లో 3,540 సీట్లు ఉన్నాయి. అలాగే 29 బీసీ సంక్షేమ గురుకులాల్లో 9,914 సీట్లు, 28 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 8,080 సీట్లు, 22 గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5,620 సీట్లు భర్తీ చేయనున్నారు. 60 మైనార్టీ కాలేజీల్లో 38,586 సీట్లు అందుబాటులో ఉన్నాయి.