శంషాబాద్ ఎయిర్పోర్టుకు క్యాబ్ సేవల బంద్
ABN , Publish Date - Sep 12 , 2026 | 04:46 AM
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి క్యాబ్ సేవలను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫారం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ప్రకటించింది. జీవో నంబర్ 46 ప్రకారం కనీస చార్జీల అమలుకు డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది
శంషాబాద్ రూరల్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి క్యాబ్ సేవలను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫారం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ప్రకటించింది. జీవో నంబర్ 46 ప్రకారం కనీస చార్జీల అమలుకు డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓలా, ఊబర్, రాపిడో డ్రైవర్లు ఎయిర్పోర్టు ట్రిప్పులను బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై గత నెల 31న అధికారులతో సమావేశం జరిగిన అనంతరం.. కనీస చార్జీలను అమలు చేయాలని ఆయా సంస్థలకు ప్రభుత్వం సూచించింది. అయితే తమ డిమాండ్లను పలు సంస్థల యాజమాన్యాలు పట్టించుకోవట్లేదని యూనియన్ ఆక్షేపించింది. అలాగే ఎయిర్పోర్టు వద్ద ఉచిత డ్రాప్ఆఫ్ సమయాన్ని 10-15 నిమిషాలకు పెంచాలని, అన్యాయంగా డ్రైవర్లపై వేస్తున్న 500 జరిమానాను ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. సమస్యల పరిష్కారానికి జీఎంఆర్, ఆర్జీఐఏ, క్యాబ్ సంస్థలతో సమావేశం నిర్వహించాలని టీజీపీడబ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షుడు సలావుద్దీన్ కోరారు.