మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:12 PM
మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేసి నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ కె హరిత మిల్లర్లను ఆదేశించారు.
- కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్, మార్చి 23(ఆంధ్రజ్యోతి): మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేసి నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ కె హరిత మిల్లర్లను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రైస్మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ధాన్యాన్ని సమయానికి మిల్లింగ్ చేసి నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. ధాన్యం సేకరణ అనంతరం మిల్లింగ్ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిర్ధిష్ట గడువుల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు. బియ్యం నాణ్యత విషయంలో ఎటువంటి రాజీపడవద్దని స్పష్టం చేశారు. మిల్లింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా అమలుచేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, అధికారులు, రైస్ మిల్లర్ల యజమానులు పాల్గొన్నారు.
- నెలాఖరులోగా మూత్రశాలల నిర్మించాలి
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం కింద మంజూరైన మూత్రశాలల నిర్మాణాలు ఈ నెల 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ కె హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీవోలు, టీఏలు, సెర్ప్ ఏపీఎంలతో ఉపాధి హామీ పథకం, స్త్రీనిధి రుణాలు, బ్యాంకు రుణాల అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 1,084 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా మూత్రశాలల నిర్మాణ పనులు ఈ నెల 31 లోగా పూర్తి చేయాలని, ఇంజనీరింగ్ అధికారులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఇంకా పనులు ప్రారంభం కాని చోట ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండల సమాఖ్య భవనాలు, గ్రామసమాఖ్య భవనాల నిర్మాణాలపై అధికారులు పర్యవేక్షించి నాణ్యత ప్రమాణాలు చేపట్టే విధంగా కాంట్రాక్టర్లు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉపాధిహామీ పథకంలో కూలీల హాజరుకాని చోట వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పనిప్రదేశాల్లో తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ సౌకర్యాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.