స్పెషల్ డ్రైవ్ ద్వారా సమస్యల పరిష్కారం
ABN , Publish Date - Apr 08 , 2026 | 11:12 PM
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నమని మేయర్ ధర్ని మధుకర్ అన్నారు.
- మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నమని మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. మంచిర్యాల కార్పొరేషన్లోని 34వ డివిజన్లో స్పెషల్ డ్రైవ్లో భాగంగా బుధవారం నస్పూర్ కాలనీలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. డివిజన్లోని ప్రజలు వివిధ సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజల నివాసాల సమీపంలో విచ్చలవిడిగా చెత్తను వేయవద్దని సూచించారు. సింగరేణి పారిశుధ్య సిబ్బంది డివిజన్లోకి వచ్చినప్పుడు చెత్త బండిలో చెత్తను వేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే అందరికి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. డివిజన్లో కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని మేయర్ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, కార్పొరేటర్లు ఎంబడి కుమారస్వామి, ఇరగదిండ్ల రవి, కర్రె శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది, సింగరేణి అధికారులు, సివిల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.