మున్సిపోల్స్ టికెట్ల వేట
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:43 PM
మున్సి పల్ ఎన్నికలకు సంబంధించిన వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావటంతో జిల్లాలో ఆయా పార్టీల్లో రాజకీయ సమీకరణలు తెరపైకి వచ్చాయి. ఈ సారి మున్సి పల్ ఎన్నికల్లో పోటీ పార్టీల మధ్య కంటే పార్టీల లోపలే ఎక్కువగా కన్పిస్తోంది.
- ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు
- రిజర్వేషన్ అనుకూలించని అభ్యర్థులు ఇతర వార్డుల కోసం అన్వేషణ
- పలకరింపులతో ఎన్నికల ప్రచారం షురూ
కాగజ్నగర్ టౌన్, జవనరి 19 (ఆంఽధ్రజ్యోతి): మున్సి పల్ ఎన్నికలకు సంబంధించిన వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావటంతో జిల్లాలో ఆయా పార్టీల్లో రాజకీయ సమీకరణలు తెరపైకి వచ్చాయి. ఈ సారి మున్సి పల్ ఎన్నికల్లో పోటీ పార్టీల మధ్య కంటే పార్టీల లోపలే ఎక్కువగా కన్పిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి టికెట్ల కోసం ఆశావహుల కదలికలు ముమ్మరమయ్యాయి. నాలుగురోజుల క్రితం జిల్లా కేంద్రంలో రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ప్రకటించారు. దీంతోటికెట్టు కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
సామాజిక సమీకరణాలే కీలకం..
రిజర్వేషన్ అనుకూలంచని వారు తమకు అనుకూలంగా ఉన్న ఇతర వార్డుల నుంచి బరిలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధిత పార్టీ నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆశావహుల సంఖ్య పెరుగుతుండటంతో పోటీ పెరిగింది. టికెట్లు దక్కించుకునేందుకు ఆశావహులు పార్టీ కార్యాలయాలు, జిల్లా స్థాయి నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు నేతలు ఇప్పటికే తమకు అనుకూలంగా ఉన్న వార్డుల్లో పలుకరింపులు ప్రారంభించి అనధికారికంగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మరో వైపు రిజర్వేషన్ల నేపథ్యం లో కొన్ని వార్డుల్లో సామాజిక వర్గాలు లెక్కలు కీలకం గా మారాయి. అధికార కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్స రాల్లో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను నమ్ము కుంది. బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో తా ము చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. బీజేపీ మాత్రం పట్టణ ఓటర్లపై దృష్టి పెట్టి సంస్థాగత బలాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
యువత, మహిళలకు
అవకాశం కల్పించేలా..
జిల్లాలో రెండు మున్సిపాల్టీలో మహిళలకు 50 శాతం టికెట్ల కేటాంచారు. బీఆర్ఎస్ పార్టీలోని సీనియ ర్ నాయకులకు ఈసారి రిజర్వేషన్ అనుకూలించక పోవటంతో వారు ఇతర వార్డుల్లో అన్వేషణలో పడ్డారు. మరోవైపు యువత, మహిళలు, తొలిసారి రాజకీయాల్లో వస్తున్న వారికి అవకాశాలు కల్పించాలనే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పార్టీలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఉండటం, అధిష్ఠానం ఇరువురిలో బీ ఫాం ఎవరికి ఇస్తారన్నది ఇక్కడ అందరిలోను టెన్షన్ పెరిగింది. ఈ సమస్యకు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పరిష్కరించాలని సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఉండటం ఇక్కడ బీఆర్ఎస్కు ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి.
ముందస్తు మంతనాలు..
కాంగ్రెస్ పార్టీ సిర్పూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ దండే విఠల్ పూర్తిగా భుజస్కందాలపై వేసుకొని అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. 30 వార్డుల్లో పక్కాగా గెలుపొందే వారికి ఎంపిక చేస్తున్నారు. రిజర్వేషన్ అనుకూలించిన వారితో ముందస్తుగానే మంతనాలు జరిపి పక్కగా సపోర్టు చేస్తామని స్పష్టంగా హామీ ఇస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుగుణ టికెట్టు వ్యవహారాలపై కూడా వాకాబు చేస్తున్నారు. మున్సిపల్ పోరులో జిల్లా నుంచి మెజార్టీ కౌన్సిలర్ స్థానాలు గెల్పించుకొని చైర్మన్ స్థానాన్ని సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
కొత్త ముఖాలను దింపేందుకు..
బీజేపీ పరిస్థితి పరిశీలిస్తే జిల్లాలో సిర్పూరు ఎమ్మె ల్యే డాక్టర్ పాల్వాయి హరీష్బాబు మున్సిపల్ ఎన్నికల ను సవాలుగా తీసుకుంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు దీటైన అభ్యర్థులు, కొత్త ముఖాలను దింపేందుకు పక్కాగా వ్యూహం వేస్తున్నారు. కాగజ్నగర్ పట్టణంలో బీజేపీకి పట్టు ఉండే వార్డులను లెక్కలేసుకుంటూ పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి తొలిసారి ఎన్నికలు కావ టం, కాగజ్నగర్ మున్సి పాలిటీకి మూడోసారి ఎన్నికలు జరుగుతుం డగా మహిళ చైర్పర్సన్కు రిజర్వేషన్ కేటాయించారు.