Share News

Kumaram Bheem Asifabad: అన్నదాతకు వరం.. పీఎం కిసాన్‌ మాన్‌ధన్‌

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:59 PM

వాంకిడి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన పథకం రైతులకు వరంగా మారనుంది.

Kumaram Bheem Asifabad:  అన్నదాతకు వరం.. పీఎం కిసాన్‌ మాన్‌ధన్‌

- 60ఏళ్లు దాటిన అన్నదాతలకు పింఛను ప్రయోజనం

- 18నుంచి 40ఏళ్ల రైతులు అర్హులు

- రూ.55 ప్రీమియంతో ప్రారంభం

వాంకిడి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన పథకం రైతులకు వరంగా మారనుంది. రైతులు వ్యద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్రప్రభుత్వం పీఎం కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. వ్యద్ధాప్యంలోకి వచ్చాక చాలామంది రైతులకు ఎలాంటి ఆదాయ వనరులు ఉండవు. ఈ నేపథ్యంలో వయస్సు పైబడిన చిన్న, సన్నకారు రైతులకు అండగా ఉండేం దుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 60ఏళ్లు నిండాక రైతులకు ప్రతీనెల రూ.3వేల చొప్పున పింఛన్‌ జీవితకాలం అందుతుంది. 18నుంచి 40ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. భూ రికార్డుల్లో తమ పేరు ఉండి రెండు హెక్టార్ల వరకు సాగు చేసేందుకు వీలుగా భూమి ఉన్న వారు ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఎప్పుడు నమోదు చేసుకున్నా పెన్షన్‌ 60ఏళ్లు దాటాకే వస్తుంది. నేషనల్‌ స్కీం, ఈఎస్‌ఐ స్కీం, ఈపీఎఫ్‌వో పరిధిలో ఉన్నవారు, ఏదైనా ఇతర చట్టబద్ద సామాజిక భద్రతా పథకాల పరిధిలో ఉన్నవారు, ఉన్నత ఆర్థికస్థితి కలిగినవారు, టాక్స్‌ పరిధిలో ఉన్నవారు, టాక్స్‌పేయర్లు ఈ పథకానికి అర్హులు కారు. ఈ పెన్షన్‌ అందేవరకు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పథకంలో చేరే వారి వయస్సును బట్టి ప్రీమియం ఉంటుంది. రైతు చెల్లించినంతే ప్రభుత్వం కూడా తన వంతుగా బీమా కంపెనీకి నగదు జమచేస్తుంది.

- ప్రీమియం వివరాలు..

18నుంచి 40ఏళ్ల వయస్సు లోపు రైతులు ఈ పథకానికి అర్హులు. ప్రతినెలా రూ.55నుంచి రూ. 200వరకు ప్రీమియంను బ్యాంక్‌ ఖాతా నుంచి చెల్లించాల్సి ఉంటుంది. రైతు చెల్లించిన ప్రీమియం మొత్తానికి కేంద్రప్రభుత్వం సమానంగా చెల్లిస్తుంది. రైతు రూ.55జమ చేస్తే ప్రతీనెల రూ.110 జమ అవుతుంది. 20నుంచి 25ఏళ్ల వయస్సు గల రైతులు రూ.61ప్రీమియం, 30ఏళ్ల వారికి రూ.105, 35 ఏళ్ల వారికి రూ.150, 40ఏళ్ల వారికి రూ.200ఉంటుంది. రైతు మరణిస్తే భార్య ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. 60ఏళ్ల తర్వాత రైతు మరణిస్తే భార్యకు రూ.1500పెన్షన్‌ వస్తుంది. రైతు ఫొటో, నివాస, ధ్రువీకరణపత్రం, సాగుభూమి, ఆదాయం వంటి వివరాలు, పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

- దరఖాస్తు చేసుకోవడం ఇలా..

పీఎం కిసాన్‌ మాన్‌ధన్‌ లబ్ధిదారులు కామన్‌ సర్వీస్‌ సెంటర్‌(సీఎంసీ) పీఎం కిసాన్‌ సీఎం కేఎంవై పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రైతు మొదట తన ఆధార్‌నంబర్‌ ఎంటర్‌ చేయాలి. పీఎం కిసాన్‌ పథకానికి నమోదైన బ్యాంక్‌ఖాతా నుంచి ప్రీమియం డబ్బులను చెల్లించాలి. ప్రతీనెల ఆటోమెటిక్‌గా డబ్బులు ఖాతా నుంచి పథకానికి జమ అవుతాయి. నామినీ వివరాలను నమోదు చేయాలి. మాన్‌ధన్‌ దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకొని రైతుసంతకం చేసి పోర్టల్‌లో అప్లోడ్‌ చేయాలి. వెంటనే మీకు పీఎం కిసాన్‌ మాన్‌ధన్‌ పింఛన్‌ కార్డు జనరేట్‌ అవుతుంది. కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ప్రతీనెల బ్యాంక్‌ ఖాతా నుంచి ప్రీమియం డబ్బులు పీఎంకేఎంవై పథకానికి ఆటోమెటిక్‌గా జమ అవుతాయి. పీఎం కిసాన్‌మాన్‌ధన్‌ లబ్దిదారులు కానట్టైతే సీఎస్‌సీలో మాన్యూవల్‌గా దరఖాస్తు చేసుకొని ఫింఛన్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రీమియం డబ్బులను నగదు రూపంలో చెల్లించాలి. ఆ తరువాత బ్యాంక్‌ ఖాతాను జత చేసుకోవాలి.

ఫ అవగాహన కల్పిస్తున్నాం..

- గోపికాంత్‌, మండల వ్యవసాయ శాఖ అధికారి

పీఎం కిసాన్‌ మాన్‌ధన్‌ పథకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతువేదికల్లో జరిగే సమావేశాలతోపాటు వ్యక్తిగతంగాను పథకం గురించి తెలియచేస్తున్నాం. ఈ పథకం రైతులకు వ్యద్ధాప్యంలో ఎంతో ఆసరగా నిలుస్తుంది. ఆసక్తిఉన్న రైతులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాల కోసం ఏఈవోలను సంప్రదించాలి.

ప్రీమియం చెల్లింపు ఇలా..

===================================

వయస్సు చెల్లించాల్సింది

18 నుంచి -20 55

21 నుంచి 24 61

25 నుంచి 29 80

30 నుంచి 34 106

25 నుంచి 39 150

40 200

===================================

Updated Date - Aug 03 , 2026 | 11:59 PM