ధాన్యం తరలింపులో వేగం పెంచండి
ABN , Publish Date - May 24 , 2026 | 11:17 PM
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుల గోదాములకు వెంటవెంటనే తరలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ఆదివారం మండలం లోని కన్నెపల్లిలో వెంకటేశ్వర్ల, లింగాపూర్లో రామ్లక్ష్మణ్, లక్ష్మీకాంతపూర్ జయలక్ష్మి, కాసిపేటలో రైస్ మిల్లుల గోదాములను జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి కలెక్టర్ సందర్శించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
దండేపల్లి మే 24 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుల గోదాములకు వెంటవెంటనే తరలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ఆదివారం మండలం లోని కన్నెపల్లిలో వెంకటేశ్వర్ల, లింగాపూర్లో రామ్లక్ష్మణ్, లక్ష్మీకాంతపూర్ జయలక్ష్మి, కాసిపేటలో రైస్ మిల్లుల గోదాములను జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి కలెక్టర్ సందర్శించారు. అక్కడ పరిస్థితి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమంలో భాగంగా ధాన్యాన్ని నిబంధనల మేరకు నిల్వ చేయాలని సూచించారు. ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం గోదాములకు తరలించాలన్నారు. రైస్ మిల్లర్లు హమాలీల సంఖ్య పెంచి వెంటవెంటనే ధాన్యం ఆన్లోడింగ్ చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యం ఎక్కువ రోజులు కేంద్రంలో ఉంచకుండా, తూకం వేసి ధాన్యం బస్తాలను లారీల ద్వారా గోదాములకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ధాన్యం రవాణాకు అవసరమైన లారీలను అందుబాటులో ఉంచుతామన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం గోదాంను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎంపీడీవో జేఆర్ ప్రసాద్, ఐకేపీ ఏపిఎం లక్ష్మి, రైస్ మిల్లర్లు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
జైపూర్: రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని నిబంధనల ప్రకారం నిల్వ చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ముదిగుంట, ఇందా రం, కుందారం లోని రైసుమిల్లులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైసుమిల్లులకు, గోదాములకు తరలించాలన్నారు. గోదాముల్లో ఆలస్యం లేకుండా దిగుమతి చేసుకోవాలని, అవసరం మేరకు హమాలీల సంఖ్యను పెంచాలన్నారు. లారీలను వేచి ఉండకుండా చూడాలన్నారు. ఆయన వెంట ఆర్ఐ తిరుపతి ఉన్నారు.