Share News

ప్రభుత్వ విద్యాసంస్థల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయండి

ABN , Publish Date - Jun 19 , 2026 | 11:29 PM

ప్రభుత్వ విద్యాసంస్థల్లో కొనసాగుతున్న నిర్మాణ, అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులను ఆదేశించారు

ప్రభుత్వ విద్యాసంస్థల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయండి
జైపూర్‌ కేజీబీవీలోని విద్యార్థినీలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

జైపూర్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యాసంస్థల్లో కొనసాగుతున్న నిర్మాణ, అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని గంగిపల్లి ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఎంపీడీవో సత్యనారాయణతో కలిసి పాఠశాలల్లో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణాలు, మూత్రశాలల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్‌ పనుల నాణ్యత విషయంలో రాజీపడవద్దని అధికారులకు సూచించారు. గంగిపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న మూత్రశాలల నిర్మాణాలను కొందరు వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారనే విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా ఇందుకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణ ప్రతీఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్‌ వసతి గృహానికి అనుబంధంగా నిర్మిస్తున్న అదనపు తరగతి నిర్మాణ పనులు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించి తగుసూచనలు చేశారు. వంటశాలలో పరిశుభ్రత పాటించాలని, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. కలెక్టర్‌ వెంట ఎంపీవో శ్రీపతి బాపురావు, కేజీబీవీ ఎస్‌వో ఫణిబాల తదితరులు ఉన్నారు.

హాజీపూర్‌: మండలంలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరగాపూర్తి చేయాలని సూచించారు. వంటశాలలో పరిశుభ్రత పాటించాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలోని రికార్డు లు, రిజిస్టర్లు తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాలన్నారు. భూభారతి సదస్సుల్లో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులతో సరిచూసి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ముల్కల్లలోని ఇసుక ఇసుక రీచ్‌ను సందర్శించి ఇసుక తరలింపు ప్రక్రియను పరిశీలించారు. మన ఇసుక వాహనం యాప్‌ ద్వారా ఇసుకను బుక్‌ చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే ఇసుకను తరలించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయనవెంట తహసీల్దార్‌ పుష్పలత ఉన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 11:30 PM