శంషాబాద్ తహసీల్దార్ పరిధి దాటారు
ABN , Publish Date - May 14 , 2026 | 04:27 AM
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల తహస్దీలార్ కార్యాలయంలో ఈ నెల 8వ తేదీన నిర్వహించిన ఆకస్మిక సోదాల్లో భారీ స్థాయిలో అక్రమాలు గుర్తించామని...
ఏసీబీ విచారణలో వెల్లడి.. ప్రభుత్వానికి నివేదిక
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల తహస్దీలార్ కార్యాలయంలో ఈ నెల 8వ తేదీన నిర్వహించిన ఆకస్మిక సోదాల్లో భారీ స్థాయిలో అక్రమాలు గుర్తించామని, తహసీల్దార్ తన పరిధి దాటి వ్యవహరించారని, ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందచేశారు. తహసీల్దార్ రవీందర్ దత్కు చెందిన కారు డ్యాష్బోర్డు నుంచి లెక్కల్లో చూపని రూ.60 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ వద్ద రూ.29,650 నగదు ఉన్నట్లు గుర్తించామని, ఈ నగదును పారవేయడానికి ప్రయత్నిస్తూ టాయిలెట్ పై కప్పులో ఒక ఫైల్లో దాచారని తెలిపారు. లైసెన్స్డ్ సరే వైర్. పృధ్వీరాజ్ వద్ద నుంచి లెక్కల్లో చూపని రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నామని, కార్యాలయంలో వ్యక్తిగత నగదు రిజిస్టర్ నిర్వహించడం లేదని గుర్తించినటు పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో తహసీల్దార్ భూ సంస్కరణల ట్రైబ్యునల్ అధికారాలను సైతం వాడుకున్నారని, తద్వారా కొందరు ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చారని.. తమ విచారణలో వెల్లడైందని వివరించారు. శంషాబాద్, తొండుపల్లి, సాతంరాయి గ్రామాలకు సంబంధించిన కొన్ని సర్వే నెంబర్ల విషయంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించామని ఏసీబీ డీజీపీ చారుసిన్హా తెలిపారు.