కొత్త ప్రయోగం.. ‘మానవవ్యర్థాలతో’ మరింత దృఢంగా కాంక్రీట్!
ABN , Publish Date - Sep 09 , 2026 | 02:35 PM
మానవవ్యర్థాల రీసైక్లింగ్ దిశగా శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగం చేశారు. మానవవ్యర్థాలతో బయోచార్ మిశ్రమాన్ని రూపొందించారు. దీన్ని కలిపితే కాంక్రీట్ దృఢత్వం 42 శాతం మేర పెరిగినట్టు గుర్తించారు.
ఇంటర్నెట్ డెస్క్: మానవవ్యర్థాల రీసైక్లింగ్పై ప్రపంచ వ్యాప్తంగా రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. పర్యావరణానికి ఎలాంటి హానీ లేకుండా మానవ మలమూత్రాలను రీసైక్లింగ్ చేసేందుకు శాస్త్రవేత్తలు కొత్త విధానాలను అన్వేషిస్తున్నారు. తాజాగా మానవ వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా బయోచార్ మిశ్రమాన్ని రూపొందించారు. దీన్ని కలిపితే కాంట్రీక్ మరింత దృఢంగా మారుతుందని గుర్తించారు. ఈ అధ్యయనం తాలూకు వివరాలు సైంటిఫిక్ జర్నల్ అనే రిపోర్టులో ప్రచురితమయ్యాయి.
సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నుంచి సేకరించిన మానవవ్యర్థాలతో శాస్త్రవేత్తలు ప్రత్యేక ప్రక్రియల ద్వారా బయోచార్ పదార్థాన్ని రూపొందించారు. ఇందులో కర్బన్ శాతం ఎక్కువ. దీన్ని వివిధ మోతాదుల్లో సాధారణ కాంక్రీట్తో కలిపి పరీక్షించారు. 10 శాతం మేర బయోచార్ కలిపినప్పుడు కాంక్రీట్కు ఉండే ఫ్లెక్సురల్ స్ట్రెంగ్త్ 42 శాతం మేర పెరిగిందని గుర్తించారు. అంటే, సాధారణ కాంక్రీట్ కంటే 42 శాతం మెరుగ్గా బయోచార్ కలిపిన కాంక్రీట్ అధిక ఒత్తిడిని తట్టుకుని పగళ్లు ఇవ్వకుండా నిలిచినట్టు గుర్తించారు. ఈ మిశ్రమానికి నీటిని పీల్చుకునే గుణం కూడా సాధారణ కాంక్రీట్ కంటే కాస్త ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు.
మానవవ్యర్థాల్లో ఉండే హానికారక కాపర్, జింక్, కాడ్మియం, క్రోమియమ్ వంటి భారీ లోహాల సమస్యకు కూడా బయోచార్తో కొంత వరకూ చెక్ పెట్టవచ్చని అన్నారు. బయోచార్ను కాంక్రీట్తో కలపడం ద్వారా భార లోహాలు పర్యావరణంలో కలవకుండా అడ్డుకోవచ్చని చెప్పారు. అయితే, 15 శాతానికి మించి బయోచార్ను కాంక్రీట్తో కలిపితే మాత్రం ఫలితాలు నిరాశాజనకంగా మారినట్టు కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. బయోచార్ వినియోగంపై మరిన్ని పరిశోధనలు జరిగితే మానవవ్యర్థాల రీసైక్లింగ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలనూ చదవండి:
పదేళ్ల పాటు శ్రమించిన యాపిల్.. త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్ ఆవిష్కరణ!
మొబైల్ ఫోన్ ఫాస్ట్గా ఛార్జ్ కావాలంటే.. ఈ ట్రిక్స్ ట్రై చేయండి.!