Share News

బీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రసక్తేలేదు

ABN , Publish Date - Mar 09 , 2026 | 04:30 AM

రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సతో పొత్తు ప్రసక్తేలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు తేల్చిచెప్పారు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోదు.

బీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రసక్తేలేదు

  • బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు బీజేపీ ప్రత్యామ్నాయం

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సతో పొత్తు ప్రసక్తేలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు తేల్చిచెప్పారు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోదు. ఇదే మా పార్టీ నిర్ణయం’ అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు మోసం చేశాయని వాటికి ప్రత్యామ్నాయంగా బీజేపీని రాష్ట్ర ప్రజలు గుర్తించారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని పలువురు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీని మజ్లిస్‌ పార్టీకి ధారాదత్తం చేసేందుకు కాంగ్రెస్‌, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 6 గ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వం, కేరళలో మాత్రం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. దేశంలో చమురు నిల్వలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘ఇరాన్‌-ఇజ్రాయిల్‌- యుద్థం నేపథ్యంలో దేశ ప్రజల్లో అనవసర భయాందోళనలను సృష్టించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులున్నా.. భారత్‌లో ఎక్కడా ముడి చమురు కొరత లేదు. ఒకే దేశంపై ఆధారపడకుండా వ్యూహాత్మకంగా పలు దేశాల నుంచి ముడి చమురును భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. యూపీఏ హయాంలో కేవలం 16 దేశాల నుంచే ముడి చమురు దిగుమతి చేసుకుంటే.. మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆ సంఖ్యను 40 దేశాలకు పెంచాం. ఏ అంతర్జాతీయ యుద్ధం జరిగినా భారత్‌ చమురు నిల్వలు, సరఫరా/ దిగుమతులపై ప్రభావం ఉండదు. దేశంలో చమురు కొరత తలెత్తదు’ అని ఆయన చెప్పారు.

సొంత క్యాడర్‌ పరిరక్షణకే బీజేపీతో పొత్తని తండ్రీ కొడుకుల ప్రచారం: విశ్వేశ్వర్‌రెడ్డి

సొంత పార్టీ క్యాడర్‌ను కాపాడుకునేందుకే బీజేపీతో పొత్తు ఉందని తండ్రీ కొడుకులు (కేసీఆర్‌, కేటీఆర్‌) ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదన్నారు. ‘బీఆర్‌ఎ్‌సలో నేతలు, కార్యకర్తలు ఎందుకు కొనసాగాలి? కుటుంబ పాలన కోసమా? కాళేశ్వరం ప్రాజెక్టు కోసమా?’ అని ఆయన ప్రశ్నించారు.

Updated Date - Mar 09 , 2026 | 04:30 AM