వన్సైడైతే కష్టమే!
ABN , Publish Date - Feb 17 , 2026 | 05:03 AM
పాకిస్థాన్ను మన జట్టు మరోసారి చిత్తుగా ఓడించిందని భారత్ క్రికెట్ ఫ్యాన్స్ గర్వంగా చెబుతున్నారు. భారత్ కోణంలో ఆలోచిస్తే అది కరెక్టే. కానీ ఇలాంటి ఏకపక్ష మ్యాచ్లు ఆదాయం పరంగా...
కరాచీ: పాకిస్థాన్ను మన జట్టు మరోసారి చిత్తుగా ఓడించిందని భారత్ క్రికెట్ ఫ్యాన్స్ గర్వంగా చెబుతున్నారు. భారత్ కోణంలో ఆలోచిస్తే అది కరెక్టే. కానీ ఇలాంటి ఏకపక్ష మ్యాచ్లు ఆదాయం పరంగా ఐసీసీకి నష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు జట్లు నువ్వా..నేనా అనేలా తలపడితేనే కదా మ్యాచ్లో మజా. కానీ కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీలలో తలపడుతున్న ప్రతిసారీ టీమిండియా అలవోకగా విజయం సాధిస్తోంది. ఇలాగయితే ప్రకటనలపై లక్షలాది రూపాయలు వెచ్చించేందుకు ఎవరు ముందుకొస్తారని పాకిస్థానీయులు ప్రశిస్తున్నారు. ‘పాకిస్థాన్-భారత్ మ్యాచ్లు పూర్తిగా ఏకపక్షమవుతున్నాయి. భవిష్యత్లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే ఆ మ్యాచ్ల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది’ అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ తాకిర్ జియా హెచ్చరించాడు. అదే జరిగితే ఐసీసీకి రెవెన్యూ గండి పడుతుందని అతడు పరోక్షంగా తెలిపాడు. ‘ఏకపక్ష మ్యాచ్లను చూసేందుకు ఫ్యాన్స్ ఇష్టపడడంలేదు. ఇలా అయితే స్పాన్సర్లు, ప్రకటనదారులు ఎలా ముందుకొస్తారు’ అని ఇక్కడ ఓ అడ్వర్టయిజింగ్ సంస్థను నడుపుతున్న పర్వెజ్ మీర్ కూడా అభిప్రాయపడ్డాడు. ఆదివారంనాటి మ్యాచ్లో పాకిస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోగానే తన మల్టీప్లెక్స్లో మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానుల్లో చాలామంది వెళ్లిపోయారని నదీమ్ వాపోయాడు. భారత్-పాక్ ఏకపక్ష మ్యాచ్లపై మాజీలు షోయబ్ అక్తర్, సక్లెయిన్ ముస్తాక్ కూడా అసంతృప్తి ప్రకటించారు. ‘మేం ఆడుతున్న రోజులనాటి ఉత్కంఠ ఏదీ? మేం కొన్ని మ్యాచ్లు ఓడిపోయి ఉండవచ్చు. అయితే అప్పట్లో మ్యాచ్లు పోటాపోటీగా సాగుతాయని ఊహించేవారు’ అని షోయబ్ గుర్తు చేశాడు.
ఇవి కూడా చదవండి:
ఆ సమయంలో మా డ్రెస్సింగ్ రూం నిరాశతో నిండిపోయింది: పాక్ హెడ్ కోచ్
టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్