మనకు పౌర స్పృహ పెరగాలి: పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా
ABN , Publish Date - May 31 , 2026 | 09:37 PM
భారతీయులకు పౌర స్పృహ పెరగాలంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ పోస్టుపై జనాలు తమ అభిప్రాయాలను నెట్టింట పంచుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయులకు పౌర స్పృహ పెరగాలంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. స్విట్జర్లాండ్లో తనకు ఎదురైన అనుభవాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ పోస్టు పెట్టారు. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
‘ఒక స్విస్ హోటల్ భారతీయ అతిథుల కోసమని ప్రత్యేకంగా కొన్ని రూల్స్ పెట్టింది. అందులోని వివరాలు చూసి నేను షాకైపోయాను. ప్రస్తుతం విదేశీ రెస్టారెంట్స్లో మనవాళ్ల గార్బా నృత్యాలు, బహిరంగ ప్రదేశాల్లో కూడా గట్టిగా మాట్లాడటాలు, ఎయిర్పోర్టులను పిక్నిక్ స్పాట్స్గా మార్చేయడాలు వంటివి చూస్తున్నాం. ఇదంతా సాఫ్ట్ పవర్ అని చెప్పుకుంటున్నాము. దావోస్లో ఒక వ్యాపారి ఒక క్లబ్లో పంజాబీ మ్యూజిక్ను పెద్దగా ప్లే చేశారు. కానీ అందరూ చిరాకు పడ్డారు’
‘క్రమశిక్షణ, నడవడికతో జపాన్ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత్ గ్లోబల్ పవర్ కావాలంటే.. భారతీయుల టాలెంట్, మర్యాదల గురించి ప్రపంచ ప్రజలపై మనసులపై ముద్రపడాలి. మన సివిక్ సెన్స్ పెంచుకోవడంపై సీరియస్గా దృష్టి పెట్టాలి’ అని తన పోస్టులో రాసుకొచ్చారు. భారతీయుల కోసం స్విస్ హోటల్ పెట్టిన రూల్స్ జాబితాను కూడా షేర్ చేశారు.
ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కొందరి అతి చేష్టల వల్ల యావత్ దేశానికి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. భారతీయ టూరిస్టులపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు పెరుగుతున్నాయని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.