23 ఏళ్లకే మేయర్గా.. యూకేలో భారత సంతతి యువకుడి అద్భుతం
ABN , Publish Date - May 24 , 2026 | 08:37 PM
23 ఏళ్లకే మేయర్గా గెలిచిన అత్యంత పిన్న వయసు భారత సంతతి వ్యక్తిగా ఒక యువకుడు రికార్డు సృష్టించారు. ఆ తరువాత వారానికి ఆయన తల్లి కూడా మరో కౌన్సిల్కు మేయర్గా ఎన్నిక కావడంతో ఆ కుటుంబంలో సంబరం అంబరాన్నంటింది.
ఇంటర్నెట్ డెస్క్: యూకేలో ఉంటున్న ఒక భారత సంతతి యువకుడు 23 ఏళ్లకే మేయర్గా ఎన్నికయ్యారు. ఆ తరువాత వారానికే ఆయన తల్లి కూడా మేయర్ కావడంతో ఆ కుటుంబంలో సంతోషం అంబరాన్నంటింది. ఎల్స్ట్రీ అండ్ బోర్హ్యమ్వుడ్ టౌన్ కౌన్సిల్ మేయర్గా ఇటీవల తుషార్ కుమార్ ఎన్నికయ్యారు. మేయర్ పదవిని దక్కించుకున్న అత్యంత పిన్న వయసు భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇది జరిగిన వారానికే హెర్ట్స్మియర్ బరో కౌన్సిల్కు తుషార్ తల్లి పర్వీన్ రాణి కూడా మేయర్గా ఎన్నికయ్యారు. మే 13న తన తనయుడు తుషార్ ఎన్నికకాగా, మే 20న తన భార్య పర్వీన్కు ఈ పదవి దక్కిందని ఆమె భర్త సునీల్ దహియా తెలిపారు.
హర్యానాలోని సోనీపత్ జిల్లా రహ్నా ఫాల్స్ గ్రామానికి చెందిన దహియా కుటుంబం 2013లో బ్రిటన్కు వెళ్లి అక్కడే స్థిరపడింది. దహియా దంపతులకు ఇద్దరు పిల్లలు. అందరిలాగే తాము బ్రిటన్కు వచ్చామని, కానీ ఇంతటి అవకాశం లభిస్తుందని తాము అప్పట్లో అస్సలు అనుకోలేదని సునీల్ దహియా సంబరపడిపోతూ చెప్పారు. తాము యూకేకు వచ్చే నాటికి తుషార్ వయసు కేవలం 10 ఏళ్లేనని అన్నారు. ‘తమ కుటుంబంలో ఇద్దరికి ఈ అవకాశం దక్కడం తమకు నిజంగా గర్వకారణమని కూడా అన్నారు. సామాజిక సేవలో తుషార్, పర్వీన్లు ఎప్పుడూ ముందుంటారని సునీల్ దహియా అన్నారు. 20 ఏళ్ల వయసున్నప్పుడే తుషార్ కౌన్సిలర్గా ఎన్నికయ్యాడని కూడా అన్నారు. తమకు భారత్తో ఎప్పటికీ ఆత్మీయ అనుబంధం ఉంటుందని కూడా అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
తెలుగు సమితి, తానా పాఠశాల ఆధ్వర్యంలో తెలుగు బడి వార్షికోత్సవం
యూకేను వీడిన విదేశీయుల్లో భారతీయులు టాప్