సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
ABN , Publish Date - Apr 04 , 2026 | 02:37 PM
రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యసభ బిల్లును ఆమోదించిన అనంతరం సౌదీ అరేబియాలో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో రాజధాని రియాధ్ నగరంలో శుక్రవారం రాత్రి విజయోత్సవ సభను ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలుగునాటయే కాకుండా విదేశాలలో కూడా తెలుగు ప్రజానీకం జయహో అమరావతి అంటూ నినదించింది. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యసభ బిల్లును ఆమోదించిన అనంతరం సౌదీ అరేబియాలో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో రాజధాని రియాధ్ నగరంలో శుక్రవారం రాత్రి విజయోత్సవ సభను ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. నాయకులు జానీ బాషా, రాజశేఖర్ చెన్నుపాటిల ఆధ్వర్యంలో జరిగిన ఈ సభను ఉద్దేశించి అమరావతి బహుజన ఐకాస కన్వీనర్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ భారతదేశంలో నివసించకున్నా తమ రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ఉండాలని ప్రగాఢంగా కోరుకుంటూ ప్రవాసీయలు కదం తొక్కారని ప్రశంసించారు. అమెరికాతో పాటు గల్ఫ్లోని అనేక మంది ప్రవాసీయులు ప్రత్యేకించి సౌదీ అరేబియా, కువైత్ దేశాల ప్రవాసీయులు అమరావతి సాధన పోరాటంలో సంఘీభావం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణా కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. డైరెక్టర్ నాగేంద్ర అక్కిలినేని ప్రవాసీయుల సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాధాకృష్ణా మాట్లాడుతూ 2014లో జరిగిన అమరావతి శంకుస్థాపనకు తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా పక్షాన తాను మక్కా పవిత్ర క్షేత్రం నుండి జంజం పవిత్ర నీళ్ళను తీసుకెళ్ళి చల్లిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ నాయకులు వడ్లమూడి సారథి నాయుడు మాట్లాడుతూ జగన్ విద్వేషపూరిత రాజకీయాలను వివరించారు. ధరిత్రి, స్త్రీ ఇద్దరూ సృష్టి, సహనం, ప్రేమ, శక్తికి ప్రతీకలని మహిళ నాయకురాలు గడ్డం శిల్ప అన్నారు. భూమి ఎలాగైతే సమస్త జీవరాశిని భరిస్తూ, పోషిస్తూ, పచ్చదనంతో కళకళలాడుతుందో, స్త్రీ కూడా కుటుంబానికి, సమాజానికి మూలస్తంభంగా నిలుస్తూ, సృజనాత్మకతకు, పోషణకు నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ఈ విషయాన్ని అమరావతి నిర్మాణ సందర్భంగా మహిళలు నిరూపించారని శిల్పా అన్నారు. అమరావతి నిర్మాణానికి 2014లో తమ కుటుంబం ఏడున్నర ఎకరాల భూమిని ఇచ్చిన విషయాన్ని పార్టీ అభిమానులైన బోగినేని భవానీ శంకర్, సుచరిత దంపతులు ఈ సందర్భంగా వెల్లడంచారు. అమరావతి నిర్మాణంలో తమ పక్షాన బోగినేని హరికిరణ్, సంధ్యరాణిలు స్వదేశంలో పోరాడారని, వారికి అమరావతి ఐక్య కార్యచరణ సమితి సభ్యుడు అప్పారావు అండగా నిలిచారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండవ అక్షిత, చెన్నుపాటి నరేశ్ ప్రసంగించారు

ఖతర్లో కూడా విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం కోర్ కమిటీ సభ్యులు పొనుగుమాటి రవి, బొడ్డు రామరావు, కొడాలి సుధాకర్, మల్లేశ్వర రావు, శ్రీనివాస బాబు, మూర్తి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు గురువారం తాము విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా ఖతర్ తెలుగు పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య తెలిపారు. బహ్రెయిన్ నుండి తాను ప్రత్యేకించి అమరావతి సాధన పోరాటంలో పాల్గొనడానికి వెళ్ళిన విషయాన్ని బాలకృష్ణ వెల్లడించారు. కువైత్ నుండి వెంకట్ కోడూరి, ఈశ్వరనాయుడు, ఓలెటీ రెడ్డయ్య చౌదరి, సురేష్ మాలపాటి దుబాయి నుండి లక్ష్మినారాయాణలు మాట్లాడారు.


ఈ వార్తలూ చదవండి:
అట్లాంటాలో ‘తానా’ మరో కార్యక్రమం.. సీపీఆర్పై శిక్షణ
సొంత ఊరిలో స్మశానం నిర్మాణం.. ఎన్నారై దాతృత్వం