క్షయతో సంతాన సమస్యలు
ABN , Publish Date - May 14 , 2026 | 01:07 AM
క్షయవ్యాధితో దెబ్బ తినేది ఊపిరితిత్తులే కావచ్చు. కానీ, సత్వరమే చికిత్స తీసుకోకపోతే, ఆ బ్యాక్టీరియా రక్తం ద్వారా శరీరమంతా వ్యాపించి, మూత్రపిండాలు, గర్భసంచి, మెదడు కూడ దెబ్బతినవచ్చు....
కౌన్సెలింగ్
డాక్టర్! మాకు పెళ్లై ఐదేళ్లు. గత మూడేళ్లుగా క్షయ వ్యాధితో బాధపడుతున్నాను. ఈ వ్యాధి సోకిన వాళ్లకు పిల్లలు కలగరని విన్నాను. ఇది ఎంత వరకూ నిజం?
ఓ సోదరి, హైదరాబాద్.
క్షయవ్యాధితో దెబ్బ తినేది ఊపిరితిత్తులే కావచ్చు. కానీ, సత్వరమే చికిత్స తీసుకోకపోతే, ఆ బ్యాక్టీరియా రక్తం ద్వారా శరీరమంతా వ్యాపించి, మూత్రపిండాలు, గర్భసంచి, మెదడు కూడ దెబ్బతినవచ్చు. వ్యాధి కారణంగా స్త్రీపురుషులు ఇద్దర్లోనూ సంతాన శక్తి తగ్గిపోవచ్చు. స్త్రీలల్లో క్షయ వ్యాధి గర్భసంచికి సోకినప్పుడు పిండం సరిగా ఏర్పడదు. మగవారిలో వీర్యకణం అండంలోకి ప్రవేశించేంత శక్తివంతంగా ఉండదు. ఈ వ్యాధి లక్షణాలు అంత త్వరగా బయటపడకపోయినా దాని ప్రభావం మాత్రం సంతానోత్పత్తి మీద పడుతుంది.
ఎంతో నిదానంగా వ్యాపించే ఈ వ్యాధితో స్త్రీలల్లో రుతుక్రమం తప్పడం, కలయిక సమయంలో నొప్పి కలగడం వంటి ఇబ్బందులు మొదలవుతాయి. మగవారిలో వీర్యకణాల కదలికలు తగ్గడం, హార్మోన్లు సరిగా విడుదల కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొందరిలో మంట, దురద తలెత్తి, అంగస్తంభనకు అంతరాయం ఏర్పడుతుంది.
ఒకసారి క్షయ వ్యాధి సోకిన చాలా మంది స్త్రీలు ఇక తల్లిని కాగలనో లేదోనని ఆందోళనపడుతుంటారు. కానీ, లక్షణాలు బయల్పడిన వెంటనే వైద్యులను కలిసి, సరైన చికిత్స తీసుకుంటే గర్భధారణ సాధ్యపడుతుంది. ప్రసవంతో క్షయవ్యాధి బిడ్డకు సంక్రమిస్తుందేమోనని భయపడి, కొందరు తల్లులు బిడ్డకు పాలివ్వడం మానేస్తారు. నిజానికి, క్షయ అనేది తల్లిపాల వల్ల కాదు, తల్లి శ్వాస వ ల్ల వస్తుంది. అందువల్ల ముఖానికి మాస్క్ వేసుకుని, నిస్సంకోచంగా బిడ్డకు పాలివ్వవచ్చు.
సాధారణంగా సరైన పోషకాహారం తీసుకోని వాళ్లు, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి క్షయ వ్యాఽధికి గురవుతుంటారు. అందువల్ల చికిత్స సమయంలో మందులే సమస్తం అనుకోకుండా, మద్యం, మాంసం, తీపి పదార్థాలు మానేసి, ఐరన్, విటమిన్- డి అధికంగా ఉండే ఆహార పదార్థాలు విరివిగా తీసుకోవాలి. సరైన పోషకాలు శరీరానికి అందకపోతే, మందులేవీ పనిచేయక శరీరం మరికొన్ని ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది. దానివల్ల వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోడానికి మరింత ఎక్కువ సమయం పట్టవచ్చు.
డాక్టర్ స్వాతి మోతె
గైనకాలజిస్ట్ అండ్ ఐ.వి.ఎఫ్ నిపుణురాలు,
హైదరాబాద్.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్