8 మంది యూత్ కాంగ్రెస్ నేతలకు పోలీసు కస్టడీ విధింపు
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:46 AM
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వద్ద నిరసనలు తెలిపినందుకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయ్ భాను చిబ్కు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి ఏఐ సమ్మిట్ వద్ద కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వద్ద నిరసనలు తెలిపినందుకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయ్ భాను చిబ్కు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి ఏఐ సమ్మిట్ వద్ద కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. దీంతో పోలీసులు చిబ్తో సహా 8మంది యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు. కాగా ఢిల్లీ పోలీసులు యూత్ కాంగ్రెస్ నేతలపై అల్లర్లకు పాల్పడినట్లు బీఎన్ఎస్ సెక్షన్ 191(1), 192 కింద అదనపు సెక్షన్లను నమోదు చేశారు. కాగా రాహుల్గాంధీ యూత్ కాంగ్రెస్ నేతల అరెస్టును ఖండించారు. అది నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. జాతి ప్రయోజనాల విషయంలో రాజీ పడ్డ ప్రధానికి వ్యతిరేకంగా గళమెత్తిన యూత్ కాంగ్రెస్ నేతలను చూసి గర్వపడుతున్నానని పేర్కొన్నారు. కాగా ఏఐ సమ్మిట్ వద్ద యూత్ కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన సూత్రధారి రాహుల్గాంధీయేనని బీజేపీ ఆరోపించింది. తెర వెనుక ఉండి ఈ నిరసన చేయించి దేశాన్ని అవమానించిన వారిని చట్టం వదిలి పెట్టదని తెలిపింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ.. రాహుల్గాంధీ సూచనల మేరకే యూత్ కాంగ్రెస్ ఈ నిరసన నిర్వహించినట్లు ఆరోపించారు. కాగా పలువురు ప్రముఖులు కూడా యూత్ కాంగ్రెస్ నిరసనలను ఖండించారు. రిటైర్డ్ జడ్జిలు, మాజీ రాయబారులు ఇది క్షమించరాని చర్య అని పేర్కొన్నారు. అది ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసిందేనని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.