Share News

Matrimony Scam: భార్యనే అక్కగా చూపి టోకరా!

ABN , Publish Date - Jan 19 , 2026 | 03:59 AM

ఆన్‌లైన్‌ వివాహ పరిచయ వేదిక ద్వారా పరిచయమైన మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను పెళ్లి కాలేదని నమ్మించేందుకు భార్యనే అక్క గా పరిచయం చేసి రూ.1.75 కోట్లు దోచుకున్నాడు.

Matrimony Scam: భార్యనే అక్కగా చూపి టోకరా!

  • మహిళా టెకీకి రూ.1.75 కోట్ల మస్కా

  • మ్యాట్రిమొని వెబ్‌సైట్‌ ద్వారా పరిచయం

  • 715 కోట్ల ఆస్తులున్న పారిశ్రామికవేత్తనంటూ ఎర

  • నమ్మించేందుకు కుటుంబమంతా రంగంలోకి

  • కలిసి వ్యాపారం చేద్దామంటూ బ్యాంకుల్లో అప్పులు

  • సోషల్‌ మీడియా ఖాతాల్లో బయటపడిన అసలు రంగు

బెంగళూరు, జనవరి 18(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ వివాహ పరిచయ వేదిక ద్వారా పరిచయమైన మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను పెళ్లి కాలేదని నమ్మించేందుకు భార్యనే అక్క గా పరిచయం చేసి రూ.1.75 కోట్లు దోచుకున్నాడు. ఈ మోసంలో కుటుంబ సభ్యులందరినీ భాగస్వాములను చేశాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని వైట్‌ఫీల్డ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ యువతికి గతేడాది మార్చిలో మ్యాట్రిమోని వెబ్‌సైట్‌ ద్వారా విజయ్‌రాజ్‌గౌడ పరిచయమయ్యాడు. తాను పారిశ్రామికవేత్తనని, రూ.715 కోట్ల ఆస్తులున్నాయని నమ్మించాడు. విజయరాజ్‌గౌడకు అప్పటికే సౌమ్యతో పెళ్లి కాగా.. వీరికి ఓ బిడ్డ ఉంది. అయితే, సౌమ్యను తన అక్కగా యువతికి పరిచయం చేశాడు. యువతిని కెంగేరికి పిలిపించుకుని కుటుంబసభ్యులను పరిచయం చేశాడు. వారంతా కలిసి పెళ్లికి సంబంధించిన అంశాలు చర్చించారు. తన తండ్రి రిటైర్డ్‌ తహసీల్దార్‌ అని నమ్మించాడు. కోడలిని బాగా చూసుకుంటామని, కట్నంగా ఇచ్చే సొమ్ముకు తాను గ్యారెంటీ అంటూ విజయ్‌ తండ్రి బోరేగౌడ భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత కొన్నిరోజులకు విజయ్‌ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. తన ఆస్తులపై ఈడీ కేసు నమోదు చేసిందని, బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌ చేశారంటూ నకిలీ కోర్టు కాపీలు చూపించాడు.


తొలుత అవసరమని యువతి నుంచి రూ.15వేలు తీసుకున్నాడు. తర్వాత కలిసి వ్యాపారం చేద్దామని నమ్మించి యువతి పేరిట పలు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నాడు. బిజినె్‌సలో లాభం వస్తుందంటూ యువతి స్నేహితుల నుంచీ లక్షలాది రూపాయలు తీసుకున్నాడు. ఇలా విడతలవారీగా రూ.1.75 కోట్లు స్వాహా చేశాడు. డబ్బు తిరిగివ్వాలని అడిగితే ఓసారి హైకోర్టులో, మరోసారి సుప్రీంకోర్టులో కేసులున్నాయంటూ వాయిదాలు వేస్తూ వచ్చాడు. తీవ్రంగా ఒత్తిడి చేయడంతో మళ్లీ డబ్బు అడిగితే హతమారుస్తానని యువతిని బెదిరించాడు. అతడి సోషల్‌ మీడియా ఖాతాలను యువతి పరిశీలించగా.. అతడికి అప్పటికే పెళ్లి అయిన విషయం వెలుగులోకి వచ్చింది. అక్కగా పరిచయం చేసిన సౌమ్యనే అతని భార్య అని తెలిసింది. దీంతో మోసపోయానంటూ యువతి ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన వైట్‌ఫీల్డ్‌ పోలీసులు కెంగేరి పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు.

Updated Date - Jan 19 , 2026 | 04:02 AM