Share News

జకీర్‌ నాయక్‌ అప్పగింతపై చర్చించాం

ABN , Publish Date - Sep 13 , 2026 | 05:22 AM

ప్రధాని మోదీతో జరిపిన ద్వైపాక్షికక చర్చల్లో వివాదాస్పద మతబోధకుడు జకీర్‌ నాయక్‌ అప్పగింత విషయం ప్రస్తావనకు వచ్చిందని మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం వెల్లడించారు.

జకీర్‌ నాయక్‌ అప్పగింతపై చర్చించాం
zakirnayak

  • మోదీతో భేటీ విషయాలను వెల్లడించిన మలేషియా ప్రధాని

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: ప్రధాని మోదీతో జరిపిన ద్వైపాక్షికక చర్చల్లో వివాదాస్పద మతబోధకుడు జకీర్‌ నాయక్‌ అప్పగింత విషయం ప్రస్తావనకు వచ్చిందని మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం వెల్లడించారు. బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి విచ్చేసిన ఇబ్రహీం శనివారం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఒక ఆంగ్ల టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ వివరాలను వెల్లడించారు. ‘ఇరుదేశాల మధ్య సంబంధాలను, విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ అంశాన్ని ప్రాధాన్య జాబితాలో ఉంచాం’ అన్నారు. కాగా, జకీర్‌ నాయక్‌ భారతదేశంలో మనీలాండరింగ్‌, విద్వేష ప్రసంగాల అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఆధ్వర్యంలోని ఇస్లామిక్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌, పీస్‌ టీవీ కార్యకలాపాలపై అధికారులు దర్యాప్తు చేపట్టడంతో 2016లో ఆయన మలేషియాకు పారిపోయారు. కాగా, కేరళకు చెందిన ఇస్లాం మతబోధకుడు కాంతాపురం అబూబకర్‌ ముస్లియార్‌ను ఆదివారం కోఝికోడ్‌లో అన్వర్‌ ఇబ్రహీం కలవనున్నారు.

Updated Date - Sep 13 , 2026 | 05:26 AM