నీట్కు సిద్ధం కావాలన్నందుకు తండ్రిని కాల్చి చంపిన కుమారుడు
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:28 AM
నీట్ పరీక్షకు సిద్ధం కావాలని పదేపదే ఒత్తిడి చేయడంతో ఆగ్రహానికి గురైన ఓ కుమారుడు, తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపాడు.
ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి డ్రమ్ములో దాచిన అక్షత్..ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన
లఖ్నవూ, ఫిబ్రవరి 23: నీట్ పరీక్షకు సిద్ధం కావాలని పదేపదే ఒత్తిడి చేయడంతో ఆగ్రహానికి గురైన ఓ కుమారుడు, తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచిపెట్టాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్నవూలో వెలుగుచూసింది. స్థానిక పాథాలజీ ల్యాబ్ యజమాని మానవేంద్ర ప్రతాప్ సింగ్ ఈనెల 20 నుంచి కనిపించకుండా పోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు అక్షత్(19)ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అసలు నిజం బయటపడింది. తండ్రిని తానే చంపినట్లు విలపిస్తూ ఒప్పుకున్నాడు. అక్షత్ గతంలో ఇంటర్ (బైపీసీ) పూర్తి చేసి, ప్రస్తుతం బీకామ్ చదువుతున్నాడు. అయితే, డాక్టర్ కావాలని, నీట్ పరీక్షకు సిద్ధం కావాలని అతడిని తండ్రి నిరంతరం ఒత్తిడి చేస్తూ తిడుతుండేవాడని అక్షత్ చెప్పాడు.