Sanjeev Sanyal: యూపీఎస్సీ పరీక్షల విధానం శుద్ధ దండగ
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:22 AM
యూపీఎస్సీ పరీక్షల విధానంపై ప్రధాని ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏఐ యుగంలోనూ అవే పాత పద్ధతులా?
ప్రధాని ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్
న్యూఢిల్లీ, డిసెంబరు 31: యూపీఎస్సీ పరీక్షల విధానంపై ప్రధాని ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధ(ఏఐ) యుగంలోనూ ఇంకా పాత పద్ధతుల్లోనే పరీక్షల ఆధారిత విద్యా విధానాన్ని కొనసాగిస్తూ యూపీఎస్సీ సమయం వృధా చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. టెక్నాలజీ యుగంలో సంప్రదాయ పాఠ్య ప్రణాళికలకు, పరీక్షల విధానానికి కాలం చెల్లిందన్నారు. ఉద్యోగ నియామకాల కోసం యూపీఎస్సీ అనుసరిస్తున్న ప్రస్తుత పరీక్షల విధానం శుద్ధ దండగ వ్యవహారమని...వార్తా సంస్థ ‘ఎఎన్ఐ’ పాడ్కాస్ట్ సంభాషణలో ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఇప్పుడు సాంకేతికత పెరిగింది. ఏఐ కీలకంగా మారింది. టెక్నాలజీ మారుతున్నంత వేగంగానే నైపుణ్యం, విజ్ఞానాలను సంపాదించే పద్ధతులు కూడా మారిపోయాయి. కానీ, ఈ వేగాన్ని అందుకునే స్థితిలో యూనివర్సిటీలు, వాటి పాఠ్య ప్రణాళికలు లేవు’’ అని సన్యాల్ అభిప్రాయపడ్డారు. నిన్న చూసిన టెక్నాలజీ ఈరోజు పాతబడిపోతున్న దశలో, అవే పాత విధానాలతో యూనివర్సిటీలు కుస్తీ పట్టడం సరికాదన్నారు. ‘‘వడ్రంగి చేసే పనిని నైపుణ్యంగా చూసే వైఖరి ఈనాటికీ వృత్తి విద్యా కోర్సుల్లో కనిపిస్తోంది’’ అని విమర్శించారు. 18 ఏళ్లకు డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిపోయే పరిస్థితి రావాలని, అవసరమైతే ఆ తర్వాత కూడా చదువును కొనసాగించవచ్చునన్నారు.