ఇంటివద్దకే వైద్య సేవలు..
ABN , Publish Date - Mar 21 , 2026 | 03:53 AM
మౌలిక వసతుల అభివృద్ధితోపాటు ప్రతి ఒక్కరికీ సమర్థవంతంగా ఆరోగ్య పరిరక్షణ (హెల్త్కేర్) సేవలను అందిస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత చెప్పారు.
తృణమూల్ కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఆవిష్కరణలో మమతా
కోల్కతా, మార్చి 20: మౌలిక వసతుల అభివృద్ధితోపాటు ప్రతి ఒక్కరికీ సమర్థవంతంగా ఆరోగ్య పరిరక్షణ (హెల్త్కేర్) సేవలను అందిస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత చెప్పారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆమె శుక్రవారం పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించారు. అందులో 10 ప్రతిజ్ఞలు చేశారు. నాలుగో దఫా తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఇచ్చే ఆర్థిక సాయం రూ.500 పెంచుతున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.1,700, సాధారణ మహిళలకు రూ.1,500 ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా పంపిణీ చేస్తామన్నారు. ప్రతి ఇంటి ముంగిట్లోకి నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామన్న మమత.. బ్లాక్, పట్టణ స్థాయిలో ప్రతియేటా వైద్య చికిత్స శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్ఆర్సీ, జనగణన పేరుతో పౌరుల పౌరసత్వాన్ని తొలగించేందుకు కేంద్రం ప్రణాళిక వేస్తోందని, ఇటువంటి చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ‘అనధికార రాష్ట్రపతి పాలన’ అమలవుతోందన్నారు.