Share News

టీఎంసీ చీఫ్‌గా మమత తొలగింపు

ABN , Publish Date - Jun 23 , 2026 | 02:15 AM

తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం మరింతగా ముదిరింది. మమతా బెనర్జీని టీఎంసీ పార్టీ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగిస్తున్నట్టు సోమవారం ...

టీఎంసీ చీఫ్‌గా మమత తొలగింపు

  • అభిషేక్‌ బెనర్జీ సస్పెన్షన్‌

  • కొత్త చైర్‌పర్సన్‌గా అరుప్‌ రాయ్‌.. రెబల్స్‌ ప్రకటన

కోల్‌కతా, జూన్‌ 22: తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం మరింతగా ముదిరింది. మమతా బెనర్జీని టీఎంసీ పార్టీ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగిస్తున్నట్టు సోమవారం రెబల్‌ ఎమ్మెల్యేల వర్గం ప్రకటించింది. సీనియర్‌ ఎమ్మెల్యే అరుప్‌ రాయ్‌ను చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నట్టు తెలిపింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ను 1998లో మమతనే స్థాపించారు. అయితే, ఇటీవలి ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో తమదే ‘నిజమైన తృణమూల్‌ కాంగ్రెస్‌’ అని ప్రతిపక్షనేత రితబ్రత బెనర్జీ ఆధ్వర్యంలోని రెబల్స్‌ ప్రకటించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి మమత మేనల్లుడు, ఎంపీ.. అభిషేక్‌ బెనర్జీని సస్పెండ్‌ చేస్తున్నట్టు తెలిపారు. సమాంతర పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించారు. న్యూటౌన్‌లోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో సమావేశమైన రెబల్‌ ఎమ్మెల్యేలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తలెత్తిన ‘రాజ్యాంగ సంక్షోభా’న్ని పరిష్కరించడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు రితబ్రత బెనర్జీ తెలిపారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పార్టీ జాతీయ వర్కింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. 2022 ఫిబ్రవరిలో ఆ కమిటీ ఏర్పాటయిందని, దాని గడువు ముగిసినా కొత్తది ఏర్పాటు కాలేదని తెలిపారు. దాంతో రాజ్యాంగపర సంక్షోభం తలెత్తిందని చెప్పారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఆయన ప్రసంగం ముగియగానే హౌరా సెంట్రల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే అరుప్‌ రాయ్‌, రితుబ్రత బెనర్జీలతో పాటు మొత్తం పది మందితో కొత్త జాతీయ వర్కింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంతరం ఈ సభ్యుల సంఖ్యను 30కి పెంచి కమిటీని విస్తరించారు. అరుప్‌ రాయ్‌ను చైర్‌పర్సన్‌గా, రతిన్‌ ఘోష్‌, సబీనా యాస్మిన్‌లను వైస్‌చైర్‌పర్సన్‌లుగా, రితబ్రత బెనర్జీ, జావేద్‌ ఖాన్‌, సాందీపన్‌ లను ప్రధాన కార్యదర్శులుగా ఎన్నుకున్నారు.

Updated Date - Jun 23 , 2026 | 02:15 AM