తెలంగాణకు మరో కేంద్రమంత్రి పదవి!
ABN , Publish Date - Jun 28 , 2026 | 04:26 AM
కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు మరింత ప్రాధాన్యం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ నుంచి ప్రస్తుతం ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులకు తోడు ..
మోదీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో అవకాశం!
న్యూఢిల్లీ, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు మరింత ప్రాధాన్యం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ నుంచి ప్రస్తుతం ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులకు తోడు త్వరలో జరగనున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మరొకరికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీ నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎంపీకి మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చని అంటున్నారు. వీరితోపాటు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే కుమారుడు శ్రీకాంత్ శిందే, నితీశ్కుమార్, తృణమూల్ నుంచి తిరుగుబాటు చేసిన సుఖేందు శేఖర్రాయ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. ఇక గతంతో కేంద్ర మంత్రిగా పనిచేసిన హిమాచల్ ప్రదేశ్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ను మళ్లీ అవకాశం కల్పిస్తారని, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్వహిస్తున్న సమాచార, ప్రసారశాఖను ఆయనకు అప్పగిస్తారని అంటున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను విద్యాశాఖకు మారుస్తారని, ఆమె స్థానంలో ఆర్థికవేత్తను నియమించే యోచనలో ప్రధాని మోదీ ఉన్నారని తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ పేరును నిర్మల స్థానంలో పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ధర్మేంద్ర ప్రధాన్, హర్దీ్పసింగ్, మనోహర్ ఖట్టర్లతోపాటు పలువురు మంత్రులను తప్పించి కొత్తవారికి అవకాశాలు కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతో్షను ఆ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన స్థానంలో ఆర్ఎ్సఎస్ మరో ప్రచారక్ను పంపించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల బీజేపీకి, సంఘ్కు జరిగిన సమావేశాలు కూడా బీఎల్ సంతోష్ లేకుండానే జరిగాయి. తెలంగాణలో బండి సంజయ్, తమిళనాడులో అన్నామలై వంటి నేతలను ప్రోత్సహించిన సంతోష్ ఎందరో నాయకులను తయారు చేశారు. తెలంగాణలో కేసీఆర్ హయాంలో ఎమ్మెల్యేలతో బేరసారాల కేసుకు సంబంఽధించి బీఎల్ సంతోష్ పేరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. 2019 నుంచి బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా సంతోష్ ఉన్నారు.