తండ్రీకొడుకుల లాకప్ డెత్.. తమిళనాడులో 9 మంది పోలీసులకు మరణ శిక్ష
ABN , Publish Date - Apr 06 , 2026 | 07:55 PM
తమిళనాడు లాకప్ డెత్ కేసులో కోర్టు తాజాగా 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. ఈ కేసును అత్యంత అరుదైనదిగా పేర్కొంది న్యాయస్థానం.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో వెలుగుచూసిన తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో తాజాగా సంచలన తీర్పు వెలువడింది. ఇందుకు బాధ్యులైన తొమ్మిది మంది పోలీసులకు మదురైలోని ఫస్ట్ అడిషనల్, డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు మరణ శిక్ష విధించింది. తూతుకుడి జిల్లాలో 2020 నాటి కొవిడ్ లాక్డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ సమయం షాపును నిర్వహించిన కేసులో షాపు యజమాని జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్ను పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలో ఉండగా వారు మరణించడంతో ఘటనపై దర్యాప్తు మొదలైంది. స్టేషన్లో వారిని టార్చర్ చేయడంతో తీవ్రగాయాల పాలై మరణించినట్టు అధికారులు తేల్చారు.
ఈ కేసులో దోషులకు అత్యంత కఠిన శిక్ష విధించాలన్న సీబీఐ వాదనలతో కోర్టు ఏకీభవించింది. దోషులు తమ అధికారాన్ని దుర్వినియోగపరిచారని, అత్యంత క్రూరంగా ప్రవర్తించారని అభిప్రాయపడింది. దీన్ని అత్యంత అరుదైన కేసుగా పేర్కొంది. ఈ కేసులో దోషులుగా తేలిన ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు పి.రఘు గణేశ్, కే. బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుల్స్ ఎస్ మురుగన్, ఎ సమదురై, కానిస్టేబుల్స్ ఎమ్ ముత్తురాజ్, ఎస్ చెల్లదురై, ఎక్స్ థామస్ ఫ్రాన్సిస్, ఎస్ వైల్ముత్తులకు న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. ఇక ఈ కేసులో పదవ నిందితుడిగా ఉన్న స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్దురై కొవిడ్తో గతంలో మరణించాడు.
ఈ వార్తలూ చదవండి:
బెంగాల్ స్టార్ క్యాంపెయినర్ లియాండర్ పేస్కు ఎక్స్ కేటగిరీ భద్రత
ఢిల్లీ అసెంబ్లీ కాంప్లెక్స్లోకి దూసుకెళ్లిన వాహనం.. డ్రైవర్ అరెస్టు